సింధుపై ఆశలు..
గత ఎడిషన్లో భారత షట్లర్లు రెండు గోల్డ్ సహా ఆరు మెడల్స్తో సత్తా చాటారు. ఈ సారి అదే స్థాయి పెర్ఫామెన్స్ చేస్తారని అంతా ఆశిస్తున్నారు. గోల్డ్కోస్ట్లో విమెన్స్, మెన్స్ సింగిల్స్లో సిల్వర్ మెడల్స్ నెగ్గిన పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ ఈసారి గోల్డ్పై గురి పెట్టారు. ఈ మధ్యే స్విస్ ఓపెన్ టోర్నీ నెగ్గిన సింధు ఫామ్లోకి వచ్చింది. థామస్ కప్లో ఇండియాకు తొలి గోల్డ్ అందించిన శ్రీకాంత్ అదే జోరును బర్మింగ్హామ్లోనూ కొనసాగించాలని చూస్తున్నాడు.
భారత డబుల్స్ టాప్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ తన పార్ట్నర్ చిరాగ్ షెట్టితో బంగారు పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు. మిక్స్డ్ డబుల్స్లో సీనియర్ ప్లేయర్ సుమీత్ రెడ్డి.. అశ్విని పొన్నప్పతో కలిసి ఎలాగైనా పతకం రాబట్టాలని ఆశిస్తున్నాడు. ఈ మధ్య విమెన్స్ డబుల్స్లో సత్తా చాటుతున్న గోపీచంద్ కూతురు పుల్లెల గాయత్రి తొలిసారి కామన్వెల్త్ బరిలో నిలిచింది. వీళ్లంతా టీమ్ ఈవెంట్లోనూ సత్తా చాటితే భారత్కు గోల్డ్ మెడల్ నిలబెట్టుకోవడం ఖాయం.
నిఖత్ గోల్డెన్ పంచ్ కొట్టెనా..?
గత రెండేళ్ల నుంచి జోరు కనబరుస్తున్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వరల్డ్ చాంపియన్షిప్ నెగ్గి స్టార్డమ్ తెచ్చుకున్న ఆమె... అదే జోరును ఇక్కడా కొనసాగించి తొలి ప్రయత్నంలోనే కామన్వెల్త్లో పతకం సాధించాలనే పట్టుదలతో ఉంది. తొలిసారి 50 కేజీ కేటగిరీలో పోటీ పడుతున్న నిఖత్ ఈ గేమ్స్ కోసం పక్కాగా ప్రిపేర్ అయింది. ఇక, మహ్మద్ హుస్సాముద్దీన్ గత ఎడిషన్లో 56 కేజీ కేటగిరీలో బ్రాంజ్ నెగ్గాడు. ఈసారి 57 కేజీ కేటగిరీలో పోటీ పడుతున్న ఈ ఆర్మీ బాక్సర్ గతంలో కంటే మెరుగైన ప్రదర్శన కనబర్చాలనుకుంటున్నాడు.
మహిళల క్రికెట్, హాకీలో..
ఇక మహిళల హాకీ టీమ్లో గోల్ కీపర్గా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎతమరపు రజని ఎంపికైంది. ఒలింపిక్స్లో నాలుగో స్థానంలో నిలిచిన భారత మహిళల హాకీ జట్టు.. అదే జోరును కొనసాగిస్తే పతకం ఖాయం. కామన్వెల్త్లో తొలిసారి ప్రవేశ పెట్టిన విమెన్స్ క్రికెట్లో పోటీపడే జట్టులో సబ్బినేని మేఘన చోటు దక్కించుకుంది. కానీ, తను కరోనా బారిన పడటంతో టోర్నీలో పాల్గొంటుందో లేదో చూడాలి. తొలి రెండు మ్యాచ్లకు అయితే ఆమె దూరంగా ఉండనుంది.
టేబుల్ టెన్నిస్ సెన్సేషన్ శ్రీజ
భారత టేబుల్ టెన్నిస్లో హైదరాబాద్ ప్లేయర్ ఆకుల శ్రీజ ఇప్పుడు సెన్సేషన్గా మారింది. ఈ మధ్యే నేషనల్ టీటీలో విమెన్స్ సింగిల్స్తో పాటు డబుల్స్ టైటిల్ నెగ్గిన ఆమె తొలిసారి కామన్వెల్త్కు ఎంపికైంది. ప్రస్తుతం శ్రీజ మంచి ఫామ్లో ఉంది. మెగా గేమ్స్లో సింగిల్స్, డబుల్స్తో పాటు టీమ్ ఈవెంట్లోనూ తను కీలక ప్లేయర్ కానుంది. మరోవైపు అథ్లెటిక్స్లో ఏపీకి చెందిన యెర్రాజి జ్యోతి 100 మీ. హర్డిల్స్లో వరుస రికార్డులతో పేరు తెచ్చుకుంటోంది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన 22 ఏండ్ల జ్యోతి మేలో మూడు వారాల్లోనే మూడు సార్లు నేషనల్ రికార్డులు బ్రేక్ చేసింది.