
ముంబై: కామన్వెల్త్ గేమ్స్లో తొలిసారి ప్రవేశ పెట్టిన మహిళల టీ20 పోటీల్లో పాల్గొనే భారత జట్టును ఆలిండియా మహిళల సెలెక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది. 15 మంది సభ్యులు గల జట్టు వివరాలను సోమవారం వెల్లడించారు. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని జట్టులో తెలుగమ్మాయి, ఆంధ్ర ప్రదేశ్కు చెందిన సబ్బినేని మేఘనకు చోటు దక్కింది. ఈ జట్టుకు స్మృతి మంధాన వైస్ కెప్టెన్గా వ్యవహరించనుంది. బర్మింగ్హామ్లో ఈ నెల 28 నుంచి జరిగే కామన్వెల్త్లో భారత్ గ్రూప్-ఎలో బరిలో నిలిచింది. ఈ నెల 29, 31, ఆగస్టు 3వ తేదీల్లో వరుసగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్, బార్బడోస్ జట్లతో పోటీ పడుతుంది.
భారత టి20 జట్టు: హర్మన్ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, తానియా, యస్తిక , దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రకర్, మేఘన సింగ్, రేణుక సింగ్, జెమీమా, రాధా యాదవ్, హర్లీన్, స్నేహ్ రాణా.
ఈ టోర్నీలో లీగ్ మ్యాచ్లు పూర్తయ్యాక రెండు గ్రూప్ల్లోనూ టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. సెమీస్ మ్యాచ్లు ఆగస్టు 6న జరుగుతాయి. సెమీస్లో విజేతగా నిలిచిన జట్లు ఆగస్టు 7న పసిడి పతకం కోసం... ఓడిన జట్లు అదే రోజు కాంస్య పతకం కోస పోటీ పడతాయి.
మహిళల క్రికెట్కు మరింత ఆదరణ కల్పించాలనే ఉద్దేశంతో గతేడాది నవంబర్లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ), ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సంయుక్తంగా సమర్పించిన బిడ్ను పరిశీలించి సీజీఎఫ్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో 1998 (కౌలాలంపూర్) తర్వాత తొలిసారి కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్కు చోటు దక్కింది. 'మహిళల క్రికెట్ను మరో స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో బర్మింగ్హామ్ కామన్వెల్త్లో అవకాశమిచ్చాం. బాలికలు, మహిళల సాధికారికత.. క్రికెట్ను మరింత అభివృద్ధి పరుచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం' అని సీజీఎఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది.
'ఇది మహిళా క్రికెట్ అభివృద్ధి కావడానికి, మహిళా సాధికారత సాధనకు లభించిన గొప్ప అవకాశం' అని ఐసీసీ ట్వీట్ చేసింది. 1998లో కౌలాలంపూర్లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారిగా పురుషుల క్రికెట్కు చోటు దక్కింది. ఆ టోర్నీలో దక్షిణాఫ్రికా విజేతగా నిలిచింది. తర్వాత మరెప్పుడూ కామన్వెల్త్ గేమ్స్లో క్రికెట్ భాగం కాలేదు.