హైదరాబాద్ను దేశ క్రీడా రాజధానిగా తయారు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం నిర్మాణాత్మకంగా, ప్రణాళికబద్ధంగా పనిచేస్తోందని తెలిపారు. మంగళవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అంతర్జాతీయ ఫుట్బాల్ స్టేడియంలో ఆరంభమైన ఇంటర్ కాంటినెంటల్ సాకర్ కప్ను సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. హైదరాబాద్లో ఈ కప్ నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశమిచ్చినందుకు ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఫుట్బాల్తో పాటు భవిష్యత్లో ఇతర క్రీడలకు సంబంధించిన మరిన్ని అంతర్జాతీయ, జాతీయ స్థాయి పోటీలు హైదరాబాద్లో నిర్వహించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

దాదాపు 20 ఏళ్ల తర్వాత హైదరాబాద్ వేదికగా జరిగిన అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్కు సాకర్ అభిమానులు పోటెత్తారు. ఇంటర్ కాంటినెంటల్ కప్లో హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత ఫుట్బాల్ జట్టు తొలి మ్యాచ్లో పూర్తిగా తేలిపోయింది. పసికూన మారిష్సతో జరిగిన తమ తొలి మ్యాచ్ను భారత్ 0-0తో డ్రాగా ముగించి తీవ్రంగా నిరాశపర్చింది.

124వ ర్యాంకర్ భారత్ తమకంటే తక్కువ ర్యాంకర్ మారిషస్పై (174) ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. భారత జట్టు బంతిని ఎక్కువ సేపు తమ ఆధీనంలోనే ఉంచుకోవడంతో పాటు గోల్ చేయడానికి అనేక అవకాశలొచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఇక, శుక్రవారం జరిగే రెండో మ్యాచ్లో సిరియా-మారిషస్, 9వ తేదీన జరిగే ఆఖరిదైన మూడో మ్యాచ్లో భారత్-సిరియా తలపడనున్నాయి.

ఇక 2018లో జరిగిన తొలి టోర్నీతో పాటు గతేడాది కూడా భారత్ విజేతగా నిలిచింది. ముచ్చటగా మూడోసారి టైటిల్పై కన్నేసింది. ఈ మెగా టోర్నీ కోసం ఫిఫా ప్రమాణాలకు తగినట్లుగా గచ్చిబౌలి స్టేడియాన్ని తీర్చిదిద్దారు. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ(సాట్) రూ. 15 కోట్లు ఖర్చు చేశాయి. ప్లేయర్లు, అధికారుల డ్రెస్సింగ్ రూమ్స్ను మార్చడంతో పాటు కొత్త ఫ్లడ్లైట్స్, 18 వేల బకెట్ సీట్లు ఏర్పాటు చేశారు.