
బీజింగ్: చైనాలో శనివారం జరిగిన మారథాన్ పెను విషాదన్ని మిగిల్చింది. భీకర గాలులు.. భారీ వర్షాల ధాటికి 21 మంది రన్నర్లు దుర్మరణం పాలయ్యారు. అల్ట్రా మారథాన్లో భాగంగా జరిగిన ఈ పోటీల్లో అత్యంత క్లిష్టమైనదిగా భావించే 100 కిలో మీటర్ల రేసులో ఈ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అథ్లెట్లు ఎల్లో నది స్టోన్ అడవి ప్రాంతానికి వచ్చేసరికి అకస్మాత్తుగా భారీ వర్షం, భీకర గాలులు మొదలయ్యాయి. గాలి, వానకు తోడు వడగళ్లు పడడంతో వారంతా చెల్లాచెదురైపోయారు.
ఈ క్రమంలోనే కొందరు తీవ్ర అస్వస్థతకు గురై అక్కడిక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. మరికొందరి ఆచూకీ గల్లంతైంది. వెంటనే అప్రమత్తమైన నిర్వహకులు.. 1200 మంది బృందంతో సహాయక చర్యలు చేపట్టారు. ఆదివారం ఉదయానికి చనిపోయిన 21 మంది మృతదేహాలూ లభ్యమయ్యాయి. 172 మంది ఈ రేసులో పాల్గొనగా.. 21 మంది మరణించినట్లు అధికారులు గుర్తించారు.
మిగిలిన 151 మంది సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది. సముద్ర మట్టానికి 6500 అడుగుల పైన ఎత్తులో ఈ రేసును నిర్వహించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా, వాతావరణ హెచ్చరికలు తెలుసుకోకుండా నిర్వాహకులు రేసును ఎలా నిర్వహించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.