బాకు: ఉత్కంఠభరితంగా సాగుతున్న చెస్ ప్రపంచకప్ ఫైనల్ టై బ్రేక్కు దారి తీసింది. టైటిల్ కోసం దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో తలపడుతున్న భారత కుర్రాడు ప్రజ్ఞానంద.. వరుసగా రెండో గేమ్నూ కూడా డ్రాగా ముగించిన విషయం తెలిసిందే. మంగళవారం వీళ్లిద్దరి మధ్య తొలి గేమ్ కూడా ఫలితం తేలకుండా ముగియడంతో టై బ్రేక్ అనివార్యమైంది.
బుధవారం రెండో గేమ్లో తెల్ల పావులతో ఆడిన ప్రపంచ నంబర్వన్ కార్ల్సన్ మొదటి నుంచి డ్రా దృష్టిలో పెట్టుకునే ఆడాడు. మరోవైపు నల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానంద కూడా ఎలాంటి పొరపాటు చేయకుండా జాగ్రత్తగా పావులు కదిపాడు. సెమీస్ తర్వాత కలుషిత ఆహారం కారణంగా అనారోగ్యం బారిన పడ్డానని చెప్పిన కార్ల్సన్.. పోరును టైబ్రేక్కు మళ్లించేందుకే ప్రయత్నించాడు.

మరో రోజు ఆగితే మరింత శక్తి వస్తుందని, అప్పుడు పూర్తిస్థాయిలో తలపడొచ్చన్నది అతని ఆలోచనగా అర్థమైంది. ప్రజ్ఞానంద కూడా రక్షణాత్మకంగానే ఆడాడు. దీంతో 30 ఎత్తుల తర్వాత ఇద్దరు ఆటగాళ్లు పాయింట్లు పంచుకునేందుకు ఒప్పుకున్నారు. రెండు క్లాసికల్ గేమ్లు ముగిసిన తర్వాత ప్రజ్ఞానంద, కార్ల్సన్ 1-1తో సమానంగా ఉన్నారు. దీంతో గురువారం విజేతను నిర్ణయించేందుకు జరిగే టైబ్రేక్పై అందరి దృష్టి నెలకొంది.
ఈ టోర్నీ నాకౌట్ ఫార్మాట్లో జరుగుతున్న ఈ ప్రపంచకప్లో ప్రతీ రౌండ్లోనూ మొదట రెండు క్లాసికల్ గేమ్లు నిర్వహించారు. ఇవి పూర్తయినా విజేత ఎవరో తేలకపోతే.. అప్పుడు టైబ్రేక్ ఆడిస్తారు. టైబ్రేక్లో మొదట ర్యాపిడ్లో పోటీ జరుపుతారు. రౌండ్కు రెండు గేమ్లు చొప్పున రెండు రౌండ్లు పోటీ ఉంటుంది.

తొలి రౌండ్లో ఫలితం వస్తే అక్కడితో పోటీ ఆపేసి విజేతను ప్రకటిస్తారు. ర్యాపిడ్ రౌండ్లు ముగిసినా ఆటగాళ్ల పాయింట్లు సమానంగా ఉంటే.. అప్పుడు ఒక్కో రౌండ్కు రెండు చొప్పున బ్లిట్జ్ గేమ్లు నిర్వహిస్తారు. రెండు రౌండ్లలో ఫలితం తేలకపోతే.. ఎవరో ఒకరు విజేతగా నిలిచేంతవరకూ బ్లిట్జ్ గేమ్లు కొనసాగిస్తారు.