
చెన్నై: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ ముగింపు దశకు చేరుకుంది. నేడు(మంగళవారం) జరిగే చివరి రౌండ్లో టోర్నీకి ఎండ్ కార్డ్ పడనుంది. ఈ ప్రతిష్టాత్మక పోటీలకు భారత్ తొలిసారి ఆతిథ్యం ఇచ్చింది. దాంతో తమిళనాడు ప్రభుత్వం టోర్నీని ఘనంగా నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా యావత్ దేశం చూసే విధంగా అంగరంగ వైభవంగా టోర్నీని ప్రారంభించింది.
ముగింపు వేడుకులను సైతం అదే రితీలో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది. ఈ క్రమంలోనే భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో ఈ టోర్నీకి గుడ్ బై చెప్పేందుకు ఏర్పాట్లు చేసింది. నేడు జరిగే టోర్నీ ముగింపు వేడుకలకు ధోనీ చీఫ్ గెస్ట్గా హాజరుకానున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా ధోనీకి తమిళనాడుతో ప్రత్యేక అనుబంధం ఉంది. గత 14 ఏళ్లుగా అతను ఐపీఎల్లో చెన్నై జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అతన్ని అభిమానులు ముద్దుగా తాల అని పిలుస్తారు.
చెస్ ఒలింపియాడ్ మహిళల విభాగంలో కోనెరు హంపీ సారథ్యంలోని భారత్-ఏ జట్టు టైటిల్ రేసులో ముందుంది. కీలకమైన పదో రౌండ్లో 3.5-0.5తో కజకిస్థాన్ను ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. జన్సాయాపై హంపి, బలబయేవాపై తానియా, నక్బయేవాపై భక్తి నెగ్గగా.. అసౌబయేవాతో గేమ్ను వైశాలి డ్రాగా ముగించింది. టోర్నీలో మరో రౌండ్ మాత్రమే మిగిలి ఉంది. పోలెండ్ రెండో స్థానంలో ఉంది.
భారత్-బీ ఆరో స్థానంలో, భారత్-సీ తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. ఓపెన్ విభాగం పదో రౌండ్లో ఉజ్బెకిస్థాన్తో మ్యాచ్ను 2-2తో డ్రాగా ముగించిన భారత్-బీ రెండు నుంచి మూడో స్థానానికి పడిపోయింది. గుకేశ్ టోర్నీలో తొలి ఓటమిని చవిచూశాడు. అబ్దుసత్తోరోవ్ చేతిలో అతడు ఓడిపోయాడు. సిందరోవ్పై ప్రజ్ఞానంద నెగ్గగా.. నిహాల్ సరీన్, అధిబన్ తమ గేమ్లను డ్రాగా ముగించారు. హరికృష్ణ, విదిత్, అర్జున్, నారాయణన్లతో కూడిన భారత్-ఏ జట్టు 2.5-1.5తో ఇరాన్పై గెలిచింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. భారత్-సీ జట్టు 28వ స్థానంలో ఉంది.