
ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించి విశ్వవేదికపై భారత జెండాను రెపరెపలాడించిన స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రాను చెన్నై సూపర్ కింగ్స్ ఘనంగా సత్కరించింది. అతను సాధించిన ఘతనకు కోటీ రూపాయలు నజరానాగా అందించింది. టోక్యో ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రోను 87.58 మీటర్లు విసిరి బంగారు పతకం సాధించిన విషయం తెలిసిందే. ఇందుకు గుర్తుగా.. 8758 నంబర్తో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీని నీరజ్కు సీఎస్కే యాజమాన్యం అందజేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్.. 'నీరజ్ను చూసి దేశం గర్వించిందని' చెప్పారు. స్పెషల్ జెర్సీని చోప్రాకు బహుమతిగా ఇవ్వడం ఆనందాన్నిచ్చిందని పేర్కొన్నారు. కాగా, చెన్నై ఇచ్చిన బహుమానానికి నీరజ్ చోప్ర ధన్యవాదాలు తెలిపాడు. 8758 జెర్సీని అభిమానులతో పంచుకున్నాడు.
ఇక నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచిన వెంటనే మహీంద్ర ఎక్స్యూవీ 700 కారును బహుమతిగా ప్రకటించిన భారత వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర తన మాటను నిలబెట్టుకున్నారు. ఆ హామీ ప్రకారం మహీంద్ర ఎక్స్ యూవీ కారు ఈ రోజు నీరజ్ చోప్రాను చేరింది. ఈ విషయాన్ని నీరజ్ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంటూ.. ఆనంద్ మహీంద్రకు ధన్యవాదాలు తెలిపాడు.
ఈ కారు కుడి భాగంలో బంగారు వర్ణంలో 87.58 అనే నంబర్తో పాటు జావెలిన్ వేస్తున్న చిన్న బొమ్మను ప్రత్యేకంగా అమర్చారు. 87.58 అనేది ఒలింపిక్స్లో నీరజ్, జావెలిన్ విసిరిన దూరం. దానిని ఇప్పుడు కారుపై అమర్చడం ఆకర్షణీయంగా అనిపిస్తోంది.టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్మెడల్ సాధించిన క్రీడాకారులకు గుర్తుగా కొత్త ఎక్స్యూవీ 700 జావెలిన్ ఎడిషన్ను ఆవిష్కరించారు. ప్రస్తుతం 65 వేలకు పైగా బుక్సింగ్ నమోదు కాగా, వచ్చే ఏడాది జనవరి 14కల్లా కనీసం 14 వేల కార్లను అయినా డెలివరీ చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కారు ధర రూ.12.49-రూ.22.89 లక్షల(ఎక్స్-షో రూమ్) మధ్య ఉంది.