న్యూఢిల్లీ: భారత్లో ప్రాచీన చరిత్ర ఉన్న యోగాసనాలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి గుర్తింపు లభించింది. ఇక నుంచి యోగాసనాలను అధికారికంగా పోటీ క్రీడగా పరిగణించనున్నట్లు గురువారం తెలిపింది. జాతీయ స్థాయి టోర్నీ ఖేలో ఇండియా క్రీడల్లోనూ యోగాసనాలను భాగం చేస్తామని క్రీడా మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 'జాతీయ వ్యక్తిగత యోగాసన క్రీడా పోటీల'ను పైలట్ చాంపియన్షిప్గా నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలిపారు.
సంప్రదాయక, ఆర్టిస్టిక్, రిథమిక్, వ్యక్తిగత ఆల్రౌండ్ చాంపియన్షిప్, టీమ్ చాంపియన్షిప్ విభాగాల్లో పోటీలను నిర్వహిస్తామన్నారు. భారత జాతీయ యోగాసన క్రీడా సమాఖ్య (ఎన్వైఎస్ఎఫ్ఐ)కు ఆర్థికంగా దన్నుగా నిలుస్తామని స్పష్టం చేశారు.
యోగాకు మరింత పాచుర్యం కల్పించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. 'ఎంతోకాలంగా యోగాసనాలు పోటీక్రీడగా ఉన్నాయి. కానీ, ప్రభుత్వం ఇప్పుడు అధికారికంగా గుర్తించింది.
యోగాను క్రీడగా చూడాలన్న ప్రధాని మోదీ ఆకాంక్ష ఇప్పుడు నెరవేరింది. క్రీడాలోకానికి యోగా గొప్ప బహు మతి' అని ఆయన తెలిపారు. ఈ నిర్ణయంతో యోగా అథ్లెట్లు ప్రభుత్వ సాయం పొందేందుకు మార్గం సుగమమైంది.