తనకు వ్యతిరేకంగా భారత స్టార్ రెజ్లర్లు వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియాతో పాటు ఇతర రెజ్లర్లు చేసిన ఉద్యమం కాంగ్రెస్ కుట్ర అని భారత రెజ్లింగ్ ఫెడరేషన్(డబ్ల్యూఎఫ్ఐ) మాజీ ప్రెసిడెంట్, మాజీ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఆరోపించారు. స్టార్ రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియా కాంగ్రెస్ పార్టీలో చేరడంతోనే ఈ విషయం స్పష్టమైందన్నారు.
మహిళా రెజ్లర్లను బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగికంగా వేధించాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని భారత రెజ్లర్లు రొడ్డెక్కిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో పాటు కొత్త పార్లమెంట్ భవన ప్రారంభ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో పోలీసుల చేతుల్లో దెబ్బలు కూడా తిన్నారు. ఒకానొక దశలో ప్రభుత్వం స్పందించడం లేదని, తాము సాధించిన పతకాలను గంగలో వేసేందుకు కూడా సిద్దమయ్యారు. ఆ తర్వాత సుప్రీం ఆదేశాలతో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం.. డబ్ల్యూఎఫ్ చీఫ్ పదవి నుంచి బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ తప్పుకోవడంతో శాంతించారు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో వినేష్ ఫోగట్ అనర్హత వేటుకు గురవ్వడం కూడా రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరిన వినేశ్ ఫోగట్ 100 గ్రాముల అధిక బరువుతో డిస్ క్వాలిఫై అయ్యింది. వినేష్ ఫోగట్ పతకం గెలవకుండా అధికార బీజేపీ, బ్రిజ్ భూషణ్ అనచరులు కుట్ర చేశారనే విమర్శలు కూడా వచ్చాయి.
తాజాగా వినేష్ ఫోగట్తో పాటు బజరంగ్ పూనియా శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఇద్దరూ కాంగ్రెస్ తరఫున పోటీ చేయనున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరూ తమ కెరీర్కు వీడ్కోలు పలకడంతో పాటు రైల్వేలోని తమ ఉద్యోగాలకు కూడా రాజీనామా చేశారు. ఈ ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరే వార్తలపై స్పందించిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్.. రెజ్లర్ల ఉద్యమం కాంగ్రెస్ నడిపించిన డ్రామా అని మండిపడ్డారు. ఈ విషయం తాను ఎప్పుడో చెప్పానని, ఇప్పుడు దేశం మొత్తానికి అర్థమైందన్నారు.