హైదరాబాద్: 'బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ' ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మారో మోగుతున్న పేరు. ఉత్తరప్రదేశ్లోని గోండా నియోజకవర్గం నుంచి గెలిచిన ఈ బీజేపీ ఎంపీ.. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. రెజ్లింగ్ ఆటతో ఈయనకు ఎలాంటి సంబంధం లేకున్నా.. రాజకీయ పలుకుబడితో 2011లో డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.
భారత్లో క్రీడలకు సంబంధంలేని రాజకీయ నాయకులు ఆయా ఫెడరేషన్స్లో పెత్తనం చెలాయించడం సర్వసాధారణమే. అందరిలానే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సైతం రాజకీయ అండదండలతో డబ్ల్యూఎఫ్ఐ ప్రెసిడెంట్ బాధ్యతలు అందుకున్నారు. అప్పటి నుంచి వరుసగా అతనే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే ఈ ఏడాది జనవరిలో అతనిపై లైంగిక ఆరోపణలు చేస్తూ స్టార్ రెజ్లర్లు రోడ్డెక్కారు.

ఓ మైనర్ బాలికతో పాటు మొత్తం ఏడుగురు బాధితులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. బ్రిజ్భూషణ్ 8 సందర్భాల్లో తమ పట్ల తప్పుగా ప్రవర్తించారని , బ్రీత్ టెస్ట్ వంకతో తమ వక్షోజాలు తాకేవాడని, టీషర్ట్ విప్పమనేవాడని, గదుల్లోకి ఒంటరిగా రమ్మనేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్రిజ్ భూషణ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ముందుగా పోలీసులు నిరాకరించినా.. సుప్రీం ఆదేశాలతో కేసు పెట్టారు.
2016 నుంచే బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్ల పట్ల తప్పుగా ప్రవర్తిస్తున్నాడని, ఎక్కువగా జూనియర్ రెజ్లర్ల పట్ల తప్పుగా ప్రవర్తించేవాడని స్టార్ రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. ఇన్నాళ్లు ఆయనకు భయపడే వాళ్లు బయటకు చెప్పుకోలేదని, ఇటీవల అతని ఆగడాలు ఎక్కువ అవ్వడంతో తమ దృష్టికి తీసుకొచ్చారని రెజ్లర్లు చెబుతున్నారు. రెజ్లింగ్ క్రీడను కాపాడేందుకే తాము ఈ ఆందోళనలు చేస్తున్నామని చెప్పారు.
మరోవైపు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ మాత్రం తనపై చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తే ఉరి వేసుకుంటానని ప్రకటించారు. ఆయన మాత్రం యూపీలో చాలా పవర్ఫుల్ లీడర్. బోండా నియోజకర్గం నుంచి 6 సార్లు విజయం సాధించారు. ఓటమెరుగని నాయకుడిగా గుర్తింపుపొందారు. పార్టీలతో సంబంధం లేకుండా గెలవగలిగే బలం అతని సొంతం. దొంగతనం, దోపీడి, హత్యా, బెదిరింపులకు సంబంధించి ఆయనపై మొత్తం 38 క్రిమినల్ కేసులున్నాయి. ఈ విషయాన్ని ఆయనే తన ఎన్నికల అఫడవిట్లో పేర్కొన్నారు.

ఓ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తిని హత్య చేసినట్లు కూడా తెలియజేశారు. ఆయనకు ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తే కాగా..పెద్ద కొడుకు శక్తి చరణ్ సింగ్ 23 ఏళ్ల వయసులో తుపాకితో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన తండ్రి స్వార్థపూరిత మనస్థత్వంతోనే చనిపోతున్నానని అతను సూసైడ్ నోట్ రాసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
బాబ్రీ మసీదు కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన తొలి వ్యక్తి కూడా బ్రిజ్భూషణ్ శరణ్ సింగే. ఈ విషయాన్ని ఆయన గొప్పగా చెప్పుకుంటారు. దావుద్ ఇబ్రహీంతో సంబంధాలున్నట్లు కూడా ఆయనపై ఆరోపణలు వచ్చాయి. డబ్ల్యూఎఫ్ఐ ప్రెసిడెంట్గా ఇన్నాళ్లు ఎలా కొనసాగుతున్నారని ఇండియన్ ఎక్స్ప్రెస్ అడిగిన ప్రశ్నకు బ్రిజ్ భూషణ్ ఆసక్తికర సమాధానమిచ్చారు.

రెజర్లంతా చాలా బలంగా ఉంటారని, వారిని కంట్రోల్ చేయాలంటే ఇంకా బలమైనవారు కావాలని, తన కంటే బలమైనవారు ఎవరున్నారని ఎదురు ప్రశ్నించారు. 2021లో జరిగిన ఓ జూనియర్ రెజ్లింగ్ టోర్నీలో 16 ఏళ్ల యువ రెజ్లర్పై అందరూ చూస్తుండగానే బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ చేయి చేసుకున్నారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన ప్లేస్లో మరే వ్యక్తి ఉన్నా.. డబ్ల్యూఎఫ్ఐ ప్రెసిడెంట్ పదవి కోల్పోయేవారు.
యూపీలో ఆయనకు సొంతంగా 60 వరకు విద్యాసంస్థలున్నాయి. ఈ విద్యా సంస్థలపై తరుచూ మాస్ కాపియింగ్ ఆరోపణలు వస్తాయి. ఆర్థికంగా, రాజకీయంగా బలంగా ఉన్న బ్రిజ్భూషణ్.. దేవి పాఠం ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలతో గొప్ప నాయకుడిగా ప్రజల మనసులు గెలుచుకున్నారు. అక్కడ ఆయనను అంతా నేతాజి అని పిలుస్తారు. రెజ్లర్లకు వ్యతిరేకంగా బ్రిజ్ భూషన్ సింగ్కు మద్దతుగా అక్కడ ఆందోళనలు కూడా జరుగుతున్నాయి.