
నిరాశగా ఉంది..
'నా ప్రదర్శనపై కొద్దిగా నిరాశతో ఉన్నా. ఎందుకంటే ఈ రోజు నా స్థాయి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయా. కానీ, వచ్చే టోర్నమెంట్లో ఈ లోపాలను సరిదిద్దుకుంటా. ఏ అథ్లెట్ అయినా వంద శాతం ప్రదర్శన ఇస్తే ఓడిపోరు అని నేను నమ్ముతా. నాకు ఎదురయ్యే సమస్యలతో నేనెప్పుడూ కుంగిపోను. ఎందుకంటే ఒక దారి మూసుకుపోతే... భగవంతుడు మరిన్ని అవకాశాలు ఇస్తాడని నమ్ముతా. సమస్యలను సానుకూల కోణంలో చూడటం నేర్చుకున్నా. కష్టపడి పనిచేయడానికి ఈ ఆలోచనా విధానమే నాకు ధైర్యాన్నిస్తుంది.

సరిదిద్దుకుంటా..
టోక్యో పారాలింపిక్స్ నుంచి చాలా నేర్చుకున్నా. ఇది గొప్ప అనుభూతి. వచ్చే పారాలింపిక్స్లో కచ్చితంగా వంద శాతం మెరుగైన ప్రదర్శన ఇస్తా. ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి. భారత్కు చేరుకోగానే సాధన ప్రారంభిస్తా. పారాలింపిక్స్లో పొందిన అనుభవాలను భవిష్యత్తులో పాల్గొనే ప్రధాన టోర్నమెంట్లలో నా తప్పులను సరిదిద్దుకోవడానికి ఉపయోగిస్తా' అని భవీనా పటేల్ చెప్పుకొచ్చింది.

ఫైనల్ కలిసిరాలేదు..
మహిళల టేబుల్ టెన్నిస్ విభాగం సింగిల్స్ క్లాస్ 4లో పోటీపడ్డ భవీనాబెన్ పటేల్.. సెమీస్ వరకు అద్భుతంగా ఆడింది. తనకంటే బలమైన ప్రత్యర్థులను చిత్తుచేస్తూ గోల్డ్ ఫైట్కు సిద్దమైంది. కానీ కీలక ఫైనల్లో చైనా ప్లేయర్ చేతిలో ఆమెకు ఓటమి తప్పలేదు.వరుసగా మూడు సెట్లలో 7-11, 5-11, 6-11 స్కోర్ తేడాతో ఓటమిపాలైంది.
భారత కాలమానం ప్రకారం.. ఈ ఉదయం 7:15 నిమిషాలకు ఈ కేటగిరీలో ఫైనల్స్ మ్యాచ్ ఆరంభమైంది. చైనాకు చెందిన యింగ్ ఝౌను భవిన పటేల్ ఎదుర్కొంది. పసిడిని ముద్దాడే అవకాశం ఉన్న మ్యాచ్ కావడంతో రెట్టింపు ఉత్సాహంతో భవీన పటేల్ కనిపించింది. కానీ జోరును కొనసాగించలేకపోయింది.

గుజరాత్ నుంచి..
భవీనా పటేల్.. పూర్తిపేరు భవీనాబెన్ హస్ముఖ్భాయ్ పటేల్. స్వరాష్ట్రం గుజరాత్. వీల్ఛైర్కే పరిమితమైన భవీనా పటేల్.. తాను దివ్యాంగురాలిననే ఆలోచనే రానివ్వలేదు. టేబుల్ టెన్నిస్పై ఆసక్తి పెంచుకున్నారు. ఈ కేటగిరిలో జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొన్నారు. స్పోర్ట్స్ ఈవెంట్లన్నింటిలో అత్యున్నతమైన రాణించి పారాలింపిక్స్లో దేశానికి రజత పతకాన్ని అందించారు.
ఆమె సాధించిన ఈ విజయం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. ఒలింపిక్స్ క్రీడాకారులకు ధీటుగా నిలిచారని, కోట్లాదిమంది యువతకు స్ఫూర్తినింపారంటూ నెటిజన్లు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతోన్నారు. టోక్యో పారాలింపిక్స్లో పాల్గొన్న తోటి క్రీడాకారుల్లో పతకాన్ని గెలవాలనే కాంక్షను రగిలించారంటూ అభినందిస్తోన్నారు. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా భవీనా పటేల్కు శుభాకాంక్షలను తెలుపుతున్నారు. భవీనా పటేల్ స్వస్థలం గుజరాత్లోని మెహసానాలో పండుగ వాతావరణం నెలకొంది. బాణాసంచా కాలుస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తోన్నారు కుటుంబీకులు.


Click it and Unblock the Notifications












