
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్లో మోకాలి గాయం కారణంగానే సెమీస్లో విజయం సాధించలేకపోయానని భారత స్టార్ రెజ్లర్, బ్రాంజ్ మెడలిస్ట్ బజరంగ్ పునియా తెలిపాడు. తాను సాధించింది కాంస్యమే అయినప్పటికి అది తన కుటుంబ సభ్యులకు స్వర్ణంతో సమానమని చెప్పాడు. ప్లేఆఫ్ మ్యాచ్కు ముందు తన మోకాలి గాయం గురించి తన తల్లి ఓం ప్యారీ భయపడిందని గుర్తు చేసుకున్నాడు. మెడల్ కన్నా ఎక్కువగా గాయం గురించి ఆలోచించిందని వెల్లడించాడు.
65 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ సెమీస్లో బజరంగ్ పునియా అజర్ బైజానికి చెందిన హాజీ అలియెవ్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే. టోక్యో నుంచి సోమవారం స్వదేశానికి తిరిగొచ్చిన బజరంగ్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడాడు.
'సెమీస్లో హజీ అలియెవ్ చేతిలో ఓటమి తర్వాత నా గదిలోకి వెళ్లి త్వరగా పడుకున్నా. ఎవరితోనూ మాట్లాడాలని అనిపించలేదు. ఆ తర్వాత ఇంటికి ఫోన్ చేసి అమ్మతో మాట్లాడా. రెజ్లింగ్ కన్నా ఎక్కువగా నా గాయం గురించే ఆమె భయపడుతున్నట్టు చెప్పింది. గెలుపోటములు ఆటలో భాగమంది. ముందు నా మోకాలిని రక్షించుకోవాలని సూచించింది. పతకం కన్నా నా ఆరోగ్యమే ముఖ్యమని అమ్మ చెప్పింది'అని బజరంగ్ అన్నాడు.
'పిల్లలు మెడల్స్ గెలవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. గాయంతోనే గెలిచిన ఈ కాంస్యం తమకు బంగారంతో సమానమని నా కుటుంబ సభ్యులు అన్నారు. ఎందుకంటే గాయం వల్ల నేను రష్యాలో 20-25 రోజులు మ్యాటుకు దూరమయ్యాననే విషయం వారికి తెలుసు." అని బజరంగ్ వెల్లడించాడు. రష్యాలో ఓ టోర్నీలో పోటీపడిన బజరంగ్ మోకాలికి జూన్ 25న గాయమైంది. దాంతో మూడు వారాలు ఆటకు దూరమయ్యాడు. టోక్యోకు అర్హత సాధించడంపైనా సందిగ్ధం ఏర్పడింది. ఒలింపిక్స్ సెమీస్లోనూ మోకాలికి గాయం కావడం వల్ల కోచ్లు మోకాలు పట్టీ ధరించి ప్లేఆఫ్ మ్యాచ్ ఆడాలని సూచించారు.
అందుకు సమ్మతించని బజరంగ్ ఏదేమైనా సరే నేరుగానే తలపడాలని నిర్ణయించుకున్నాడు.'నాకు నొప్పి ఉండటం వల్ల ఫిజియో పట్టీ ఇచ్చాడు. సౌకర్యంగా లేకపోయినా తొలి రెండు రౌండ్లు పట్టీ ధరించా. కానీ అది నా కదలికలకు అడ్డంకిగా మారింది. అందుకే బ్రాంజ్ మెడల్ ఫైట్లో దానిని తీసేశా. గాయం మరింత తీవ్రమైతే ఆ తర్వాత చూసుకుందాం. కానీ నేను కాంస్యం గెలవకపోతే ఇంకేం చేయగలం అని నా కోచులతో చెప్పా. నాకు పతకమే ముఖ్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టీ ధరించనని చెప్పాను. ఏదేమైనా కాంస్యం అందుకున్నందుకు సంతోషంగా ఉంది" అని బజరంగ్ చెప్పుకొచ్చాడు.
టోక్యో ఒలింపిక్స్లో పతకాలు సాధించి సోమవారం స్వదేశం చేరుకున్న అథ్లెట్ నీరజ్ చోప్రా, రెజ్లర్లు రవి దహియా, బజరంగ్ పూనియా, మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్లతో పాటు భారత పురుషుల హాకీ జట్టు సభ్యులకు సోమవారం కేంద్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. రజత, కాంస్యాలు సాధించి కొద్ది రోజుల క్రితమే భారత్కు వచ్చేసిన మీరాబాయి చాను, పీవీ సింధు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.