
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా తన పెద్ద మనసు చాటుకున్నాడు. మహమ్మారి కరోనాపై పోరాటానికి తన వంతు సాయంగా ఆరు నెలల జీతాన్ని విరాళంగా ప్రకటించాడు. క్రికెట్ పిచ్చిలో మునిగే ఈ దేశం కోసం కోట్లు సంపాదించే క్రికెటర్లు ముందుకు రాకున్నా.. బాధ్యత గల క్రీడాకారుడిగా తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. అంతేకాకుండా ఈ వైరస్ ప్రపంచాన్నే మింగేసే పరిస్థితులున్న నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ వాయిదా వేయాలని సూచించాడు.
గతేడాది జరిగిన వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో కాంస్యం గెలుచుకున్న ఈ 25 ఏళ్ల స్టార్ రెజ్లర్.. రైల్వేలో స్పెషల్ ఆఫిసర్గా ఉద్యోగం చేస్తున్నాడు.'నా ఆరు నెలల జీతాన్ని హర్యానా కరోనా రిలీఫ్ ఫండ్కు విరాళంగా ప్రకటిస్తున్నాను. జైహింద్ జై భారత్' అని బజరంగ్ ట్వీట్ చేశాడు. ఇక పీటీఐ వార్త సంస్థతో మాట్లాడుతూ.. ఒలింపిక్స్ ముందు తాము కరోనా వైరస్తో పోరాడుతున్నామన్నాడు.
ఈ పరిస్థితి మరో రెండు, మూడు నెలలు ఇలానే కొనసాగితే ఒలింపిక్స్ వాయిదా వేయాల్సిందేనన్నాడు. ఇప్పటికే కొన్ని దేశాలు తమ అథ్లెట్లను పంపిచమంటున్నాయని, ఇది ఒక్క భారత సమస్యనే కాదని ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్ అని తెలిపాడు.