లండన్: కరోనా వైరస్ కారణంగా క్రీడా టోర్నీల రద్దు లేదా వాయిదాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడగా.. తాజాగా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ కూడా పోస్ట్పోన్ అయింది. వాస్తవానికి ఈ మెగా ఈవెంట్ వచ్చే ఏడాదే జరగాల్సి ఉన్నా.. టోక్యో ఒలింపిక్స్ రీషెడ్యూల్తో వరల్డ్ అథ్లెటిక్స్ టోర్నీ తేదీలను కూడా మార్చాల్సి వచ్చింది.
ఇక జపాన్ వేదికగా ఈ ఏడాది జూలైలో ప్రారంభంకావాల్సిన టోక్యో ఒలింపిక్స్ 2020ను కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా వేశారు. 20201లో 2020 ఒలింపిక్స్ పేరిటనే జూలై 21 నుంచి ఆగస్టు 8 మధ్యలో నిర్వహిస్తామని ఆర్గనైజర్స్ స్పష్టం చేశారు. అయితే షెడ్యూల్ ప్రకారం ప్రపంచ అథ్లెటిక్స్ వచ్చే ఏడాదే ఆగస్టు 6 నుంచి 16 మధ్య జరగాల్సింది. ఈ రెండు టోర్నీల షెడ్యూల్ దాదాపు ఒకే సమయంలో జరుగుతుండటం వల్ల ప్రపంచ అథ్లెటిక్స్ షెడ్యూల్ను రీ షెడ్యూల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇదే విషయాన్ని ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. కొత్త షెడ్యూల్ ప్రకారం ఒరెగాన్(అమెరికా)లో 2022 జూలై 15 నుంచి 24 వరకు వరల్డ్ అథ్లెటిక్స్ టోర్నీ జరుగుతుంది. మరోవైపు 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్(జూలై 27-ఆగస్టు 7), యూరోపియన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు చేయాల్సి వచ్చిందని వరల్డ్ అథ్లెటిక్స్ సమాఖ్య చీఫ్ సెబాస్టియన్ కో అన్నారు. ఆరు వారాల వ్యవధిలో మూడు మేజర్ ఈవెంట్లు జరుగనున్నాయని, అథ్లెట్లకు ఇది బొనాంజా అని కో తెలిపారు.