ప్యాంగ్చాంగ్ (సౌత్ కొరియా): ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ ప్లేయర్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ శుభారంభం చేయలేకపోయింది. శ్రీజ ఓడినా.. భారత అమ్మాయిలు సుతీర్థ ముఖర్జీ, ఐహిక ముఖర్జీ ముందంజ వేశారు.
గురువారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఆకుల శ్రీజ 5-11, 6-11, 9-11తో వరల్డ్ 8వ ర్యాంకర్ మిమా ఇటో (జపాన్) చేతిలో ఓటమిపాలైంది. ఇతర మ్యాచ్ల్లో సుతీర్థ 10-12, 11-8, 11-7, 11-7తో యు చెన్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించగా.. ఐహిక 11-2, 11-0, 11-1తో సువాల్ సిక్కా (నేపాల్)ను ఓడించింది.

దియా చితాలె 3-11, 6-11, 8-11తో చెన్ మెంగ్ (చైనా) చేతిలో పరాజయం చవిచూసింది. భారత స్టార్ ప్లేయర్ మనిక బత్రా టోర్నీ నుంచి వైదొలిగింది.
మహిళల డబుల్స్లో ఐహిక- సుతీర్థ జోడీ 11-1, 13-11, 10-12, 11-7తో ఏంజెలినా- సర్వినోవ్ (కజకిస్తాన్) జంటపై నెగ్గి క్వార్టర్ఫైనల్ చేరుకుంది. పురుషుల డబుల్స్లో అబ్దుల్ అజీజ్- కుత్బిదిలో తెషబోయ్ (ఉజ్బెకిస్తాన్) జోడీని మానవ్ థక్కర్- మానుష్ షా జంట చిత్తుచేసి క్వార్టర్స్లో అడుగుపెట్టింది.
ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే. బుధవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 0-3తో చైనీస్ తైపీ చేతిలో పరాజయం చవిచూసింది.
తొలి సింగిల్స్లో ఆచంట శరత్ కమల్ 6-11, 6-11, 9-11తో చువాంగ్ యువాన్ చేతిలో ఓడాడు. రెండో మ్యాచ్లో సత్యన్ 5-11, 6-11, 10-12తో లిన్ యున్ చేతిలో పరాజయం పాలయ్యాడు. మూడో పోరులో హర్మీత్ దేశాయ్ 6-11, 7-11, 11-7, 9-11తో చెంగ్ కావొ చేతిలో ఓడటంతో భారత్ 0-3తో పరాజయం చవిచూసింది. సెమీస్లో ఓడిన భారత్కు కాంస్యం లభించింది.