Asian Para Games 2023: ఆసియా గేమ్స్ 2023లో 107 పతకాలతో నయా చరిత్ర సృష్టించిన భారత్.. పారా ఆసియా గేమ్స్లోనూ అదే జోరు కొనసాగిస్తోంది. చైనాలోని హాంగ్జౌ వేదికగానే జరుగుతున్న ఆసియా పారా గేమ్స్లో ఇప్పటికే భారత్ 100 పతకాల మైలు రాయిని ధాటింది. భారత పారా అథ్లెట్ దిలీప్ మహదు గవిత్ పసిడి గెలిచి ఈ రికార్డు అందించాడు.
పురుషుల 400 మీటర్ల పరుగును 49.48 సెకన్లలో పూర్తి చేసిన దిలీప్.. పసిడి పతకంతో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఇప్పటి వరకు ఆసియా పారా క్రీడల్లో భారత్ 29 బంగారు, 31 రజత, 51 కాంస్య పతకాలతో 111 మెడల్స్ను ఖతాలో వేసుకుంది. తద్వారా పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.

ఇక చైనా అత్యధికంగా 214 స్వర్ణాలు, 167 వెండి, 140 సిల్వర్ మెడల్స్తో 521 పతకాలను కైవసం చేసుకొని అగ్రస్థానంలో కొనసాగుతోంది. చైనా తర్వాత 131 పతకాలతో ఇరాన్ రెండో స్థానంలో నిలిచింది.
ఆసియా పారా గేమ్స్లో 100 పతకాలు సాధించిన భారత బృందాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. సోషల్ మీడియా వేదికగా పారా అథ్లెట్లను అభినందిస్తూ ప్రశంసల జల్లు కురిపించారు. పారా అథ్లెట్ల కఠిన శ్రమ, అంకిత భావంతోనే భారత్ సరికొత్త చరిత్రను సృష్టించిందని పేర్కొన్నారు.
'ఆసియా పారా గేమ్స్లో భారత్ 100 పతకాల మార్క్ను ధాటేసింది. అద్భుతమైన ప్రతిభ, కష్టానికి దక్కిన ఫలితం ఇది. మన అథ్లెట్ల దృఢ సంకల్పంతోనే ఇది సాధ్యమైంది. క్రీడాకారులకు నా అభినందనలు'అని మోదీ ట్వీట్ చేశారు. 2018 ఆసియా పారా గేమ్స్లో భారత్ 72 పతకాలు (15 బంగారం, 24 రజతం, 33 కాంస్య) సాధించింది.