హాంగ్జౌ: ఆసియా గేమ్స్ 2023లో భారత్ జోరు కొనసాగుతోంది. నాలుగో రోజు అయిన బుధవారం పోటీల్లో భారత్కు మరో స్వర్ణం లభించింది. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో 22 ఏళ్ల భారత షూటర్ సిఫ్ట్ కౌర్ సమ్రా వరల్డ్ రికార్డు నమోదు చేసింది. 469.6 స్కోర్తో టాప్లో నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
ఇదే ఈవెంట్లో భారత్కు చెందిన 21 ఏళ్ల షూటర్ ఆషీ చౌక్సే కాంస్య పతకం సాధించింది. అంతకుముందు మహిళల 50 మీటర్ల రైఫిల్ టీమ్ విభాగంలో సిఫ్ట్ కౌర్ సమ్రా, మనిని కౌశిక్, ఆషి చోక్సీలతో కూడిన భారత మహిళల జట్టు రజత పతకం సొంతం చేసుకుంది. టీమ్ ఈవెంట్ పతకం సాధించిన సిఫ్ట్ కౌర్, ఆషి చోక్సీలు.. వ్యక్తిగత విభాగాల్లోనూ మెడల్స్తో మెరిసారు.

ఈ ఉదయమే మహిళల షూటింగ్ 25 మీటర్ల పిస్టోల్ టీమ్ విభాగంలో భారత్కు స్వర్ణ పతకం దక్కింది. మను భాకర్, ఇషా సింగ్, రిథమ్ సాంగ్వాన్లతో కూడిన భారత త్రయం అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకం సాధించింది. దాంతో భారత పతకాల సంఖ్య మొత్తం 18కి చేరింది. ఈ ఒక్కరోజే భారత్ 4 పతకాలు సాధించింది. ఇందులో రెండు స్వర్ణాలు ఉండటం విశేషం.
మహిళల షూటింగ్ 25 మీటర్ల పిస్టోల్ టీమ్ వ్యక్తిగత విభాగం పోటీలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ ఈ వెంట్లో కూడా భారత్కు పతకాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఈవెంట్ ఫైనల్కు దూసుకెళ్లిన మను భాకర్, ఇషా సింగ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీమ్ ఈవెంట్లో మను భాకర్ అత్యధికంగా 590 స్కోర్ నమోదు చేసి అగ్రస్థానంలో నిలవగా.. ఇషా సింగ్ 586 స్కోర్తో ఐదో స్థానంలో నిలిచింది.
రిథమ్ సాంగ్వాన్ 583 స్కోర్తో ఏడో స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్ను దర్కించుకోలేకపోయింది. ఒక దేశం నుంచి ఇద్దరికి మాత్రమే అవకాశం ఉండటంతో రిథమ్ సాంగ్వాన్కు ఫైనల్ ఆడే అవకాశం దక్కలేదు. ఈ ప్రదర్శనను రిపీట్ చేసినా మను భాకర్కు స్వర్ణం దక్కనుంది.