హాంగ్జౌ: ఆసియా గేమ్స్ 2023లో భారత జావెలిన్ త్రోయర్, గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించాడు. బుధవారం జరిగిన జావెలిన్ త్రో ఈవెంట్లో ఈటెను 88.88 మీటర్ల దూరం విసిరి స్వర్ణం సొంతం చేసుకున్నాడు. భారత్కే చెందిన జెనా కిశోర్ కుమార్ ఈటెను 87.50 మీటర్ల దూరం విసిరి రజత పతకం సాధించాడు.
తొలి ప్రయత్నంలో నీరజ్ చోప్రా జావెలిన్ను 85 మీటర్ల కంటే ఎక్కువ దూరమే విసిరాడు. కానీ సాంకేతిక లోపంతో ఈ దూరాన్ని లెక్కించలేకపోయారు. దాంతో అతనికి మరో అవకాశం ఇవ్వగా.. 82.38 మీటర్ల దూరమే విసిరాడు. మూడో ప్రయత్నంలో పౌల్ చేసిన నీరజ్ చోప్రా.. నాలుగో ప్రయత్నంలో అత్యధికంగా 88.88 మీటర్ల దూరం విసిరాడు. ఐదో ప్రయత్నంలో 80.80 మీటర్లే విసరగా.. మిగతా బళ్లెం వీరులు ఎవరూ నీరజ్ చోప్రాను అధిగమించకపోవడంతో అతనికే స్వర్ణం లభించింది.

కిషోర్ కుమార్ తొలి ప్రయత్నంలో 81.26 మీటర్ల దూరం విసరగా.. రెండో ప్రయత్నంలో 79.76, మూడో ప్రయత్నంలో 86.77, నాలుగో ప్రయత్నంలో 87.54 మీటర్లు విసిరి సిల్వర్ మెడల్ సాధించాడు. జపాన్కు చెందిన డీన్ రోడెరిక్ గెన్కీ 82.68 మీటర్లతో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు.
పురుషుల 4x400 మీటర్ల రిలే టీమ్ ఈవెంట్లో భారత్కు బంగారు పతకం దక్కింది. మహిళల 4x400 రిలే ఈవెంట్లో రజత పతకం దక్కింది. దాంతో భారత్ పతకాల సంఖ్య 83కు చేరింది. 72 ఏళ్ల ఆసియా క్రీడల చరిత్రలో భారత్కు 83 పతకాలు రావడం ఇదే తొలిసారి. గత ఆసియా గేమ్స్లో భారత్ 70 పతకాలను సాధించింది.

ఈ సారి 100 పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత అథ్లెట్ల బృందం ఆ దిశగా దూసుకెళ్తోంది. ఇంకా ఈవెంట్స్ జరగనున్న నేపథ్యంలో సునాయసంగా 100 పతకాలు అందుకునే అవకాశం ఉంది.