హాంగ్జౌ: ఆసియా గేమ్స్ 2023 ఘనంగా ముగిసాయి. భారత ఈవెంట్స్ అన్నీ శనివారమే ముగిసినా.. ఆదివారం కేవలం కరాటే, ఆర్టిస్టిక్ స్విమ్మింగ్ ఈవెంట్స్ మాత్రమే జరిగాయి. ఈ విభాగాల్లో భారత్ పోటీపడలేదు. సాయంత్రం జరిగిన ముగింపు వేడుకలతో హాంగ్జౌ ఆసియా క్రీడలకు తెరపడింది.
ఆసియా గేమ్స్ ముగింపు వేడుకల్లో భారత్ నుంచి 100 మంది క్రీడాకారులు, అధికారులు మాత్రమే పాల్గొన్నారు. చాలా మంది అథ్లెట్లు ఈవెంట్స్ ముగియగానే స్వదేశానికి పయనమయ్యారు. ముగింపు వేడుకల్లో భారత్ ఫ్లాగ్ బేరర్గా పురుషుల హాకీ టీమ్ కీపర్ పీఆర్ శ్రీజేష్ వ్యవహరించారు. మువ్వన్నెల జెండాను చేత పట్టుకొని ఆసియా గేమ్స్కు వీడ్కోలు పలికాడు.

వంద పతకాల లక్ష్యంతో ఆసియా క్రీడల్లో బరిలోకి దిగిన భారత క్రీడా బృందం అనుకున్నది సాధించి నయా చరిత్రను లిఖించింది. మొత్తం 107 మెడల్స్తో భారత క్రీడా చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. 2010లో న్యూఢిల్లీ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో భారత్ 101 పతకాలు సాధించింది. ఈ ప్రదర్శనను తాజా ఆసియా గేమ్స్లో భారత్ అధిగమించింది. 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలతో మొత్తం 107 పతకాలను కైవసం చేసుకుంది.
డ్రాగన్ కంట్రీ చైనాలో భారత క్రీడాకారుల అత్యుత్తమ ప్రదర్శనతో మువ్వెన్నెల జెండా 107 సార్లు రెపరెపలాడింది. 28 సార్లు జాతీయ గీతం ప్లే అయ్యింది. భారత జైత్రయాత్రను ఉద్దేశించి అధికారిక బ్రాడ్కాస్టర్ సోనీ టీవీ అద్భుత వీడియోను రూపొందించింది. భారత క్రీడాకారుల అత్యుత్తమ ప్రదర్శనతో కూడిన ఈ వీడియో భారతీయులందరికీ గూస్బంప్స్ తెపిస్తోంది.