హాంగ్జౌ: ఆసియా గేమ్స్ 2023లో భారత్ జోరు కొనసాగుతోంది. నాలుగో రోజు అయిన బుధవారం పోటీల్లో భారత్ బంగారు పతకంతో శుభారంభం చేసింది. మహిళల షూటింగ్ 25 మీటర్ల పిస్టోల్ టీమ్ విభాగంలో భారత్కు స్వర్ణ పతకం దక్కింది. మను భాకర్, ఇషా సింగ్, రిథమ్ సాంగ్వాన్లతో కూడిన భారత త్రయం అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకం సాధించింది.
మొత్తం 1759 స్కోర్తో భారత షూటర్లు పసిడి పతకాన్ని అందుకున్నారు. ఇందులో మను భాకర్ అత్యధికంగా 590 స్కోర్ నమోదు చేసి అగ్రస్థానంలో నిలవగా.. ఇషా సింగ్ 586 స్కోర్తో ఐదో స్థానంలో నిలిచింది. రిథమ్ సాంగ్వాన్ 583 స్కోర్తో ఏడో స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్ను దర్కించుకోలేకపోయింది. ఒక దేశం నుంచి ఇద్దరికి మాత్రమే అవకాశం ఉండటంతో రిథమ్ సాంగ్వాన్కు అవకాశం దక్కలేదు. మహిళల వ్యక్తిగత 25 మీటర్ల పిస్టోల్ పోటీలు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి.

భారత్ తర్వాత 1756 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన చైనాకు రజత పతకం దక్కగా.. 1742 పాయింట్లో కొరియా మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం గెలిచింది.
అంతకముందు మహిళల 50 మీటర్ల రైఫిల్ విభాగంలో సిఫ్ట్ కౌర్ సమ్రా, మనిని కౌశిక్, ఆషి చోక్సీలతో కూడిన భారత మహిళల జట్టు రజత పతకం సాధించింది. ఈ మెడల్స్తో భారత్ పతకాల సంఖ్య 16కు చేరింది. ఇందులో నాలుగు స్వర్ణాలు, ఐదు రజతాలు, ఏడు కాంస్య పతకాలు ఉన్నాయి.
తొలి రోజు ఐదు పతకాలు సాధించిన భారత్ రెండో రోజు ఒక పతకాన్ని అదనంగా సాధించి మొత్తం 6 మెడల్స్ ఖాతాలో వేసుకుంది. పైగా ఇందులో రెండు స్వర్ణాలు కూడా ఉన్నాయి. కానీ మూడో రోజు పోటీల్లో మాత్రం ఆ ఊపు కొనసాగలేదు. మంగళవారం భారత్ మూడు పతకాలతో సరిపెట్టుకుంది. కానీ అందులో ఓ స్వర్ణం ఉండటం, అది భారత్ ఖాతాలో చేరడం మాత్రం అనూహ్యమే.
ఎవ్వరూ ఊహించని విధంగా గుర్రపు పోటీల్లో భారత్ స్వర్ణం చేజిక్కించుకుంది. డ్రెసేజ్ జట్టు 41 ఏళ్ల తర్వాత ఆసియా కీడ్రల్లో భారత్కు క్రీడల స్వర్ణం సాధించిపెట్టింది. సెయిలింగ్లో భారత్కు ఒక్కో రజతం, కాంస్యం దక్కాయి. నాలుగో రోజు పోటీల ఆరంభంలోనే భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరగా.. ముగింపులోపు మరిన్నీ పతకాలు రానున్నాయి.