హాంగ్జౌ: ఆసియా గేమ్స్ 2023లో భారత షూటర్లు దుమ్మురేపుతున్నారు. బుధవారం మహిళా షూటర్లు పతకాల మోత మోగించగా.. గురువారం పురుష షూటర్లు సత్తా చాటారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ టీమ్ ఈవెంట్లో సరబ్జోత్ సింగ్, శివ నర్వాల్, అర్జున్ సింగ్ చీమాతో కూడిన భారత బృందం పసిడి పతకం సొంతం చేసుకుంది.
భారత షూటర్లు 1734 స్కోర్తో అగ్రస్థానంలో నిలవగా.. 1733 పాయింట్లతో ఆతిథ్య చైనా రెండో స్థానంలో నిలిచింది. 1730 స్కోర్తో వియాత్నం కాంస్య పతకం సొంతం చేసుకుంది. భారత షూటర్లలో సరబ్జోత్ 580 పాయింట్లతో ఐదో స్థానంలో నిలవగా.. అర్జున్ 578 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచి వ్యక్తిగత విభాగంలో ఫైనల్కు అర్హత సాధించారు.

ఈ రోజు మధ్యాహ్నం వ్యక్తిగత విభాగం ఫైనల్స్ జరగనున్నాయి. ఇక ఇది భారత్కు ఆరో గోల్డ్ మెడల్ కాగా.. ఇందులో నాలుగు పతకాలు షూటింగ్లోనే రావడం విశేషం. ఓవరాల్గా 24 పతకాలతో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. ఇందులో 6 స్వర్ణాలు, 8 రజతాలు, 10 కాంస్య పతకాలు ఉన్నాయి.
బుధవాం ఒక్క రోజులోనే భారత్ ఖాతాలో ఎనిమిది పతకాలు చేరాయి. ఇందులో షూటర్లే ఏడింటిని సొంతం చేసుకోవడం విశేషం. మరొకటి సెయిలింగ్లో వచ్చింది. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ వ్యక్తిగత విభాగంలో సిఫ్ట్ కౌర్ సమ్రా స్వర్ణ పతకం సాధించగా.. మహిళల 25 మీటర్ల జట్టు విభాగంలో మను బాకర్, ఈషా సింగ్, రిథమ్ సంగ్వాన్ బృందం గోల్డ్ సొంతం చేసుకుంది.
మహిళల 25 మీటర్ల పిస్టోల్ వ్యక్తిగత విభాగంలో ఈషా సింగ్ రజత పతకం కైవసం చేసుకోగా.. పురుషుల స్కీట్ షూటింగ్ వ్యక్తిగత విభాగంలో అనంత్జీత్ సింగ్ నరుక రజత పతకం గెలిచాడు. మహిళల 25 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ టీమ్ విభాగంలో ఆషి చౌష్కీ, మనిని కౌషిక్, సిఫ్ట్ కౌర్ సమ్రాతో కూడిన జట్టు రజతం సొంతం చేసుకుంది.
మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ వ్యక్తిగత విభాగంలో ఆషి చౌష్కీ కాంస్యం గెలుచుకోగా.. పురుషుల స్కీట్ షూటింగ్ జట్టు విభాగంలో అంగద్, గుర్జోత్, అనంత్జీత్ సింగ్ కాంస్య కైవసం చేసుకున్నారు. పురుషుల దింగే ఐఎల్సీఏ 7 విభాగంలో విష్ణు శరవణన్ కాంస్య దక్కించుకున్నాడు.