హాంగ్జౌ: ఆసియా గేమ్స్ 2023లో భారత అథ్లెట్ జోరు కొనసాగుతోంది. బుధవాం పోటీల్లో భారత్కు శుభారంభం దక్కింది. భారత్ పతకాల ఖాతాలో మరో స్వర్ణంతో పాటు కాంస్య పతకం వచ్చి చేరింది. దాంతో మెడల్స్ సంఖ్య 71కి చేరింది. 72 ఏళ్ల ఆసియా క్రీడల చరిత్రలో భారత్కు 71 మెడల్స్ రావడం ఇదే తొలిసారి. ఇందులో 16 స్వర్ణాలు, 26 రజతాలు, 29 కాంస్య పతకాలు ఉన్నాయి.
గత ఆసియా గేమ్స్లో భారత్ 70 పతకాలను సాధించింది. బుధవారం జరిగిన కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ వెన్నం- ఓజాస్ డియోటలే బంగారు పతకం సాధించి రికార్డు మెడల్ అందించారు. ఫైనల్లో దక్షిణ కొరియా జట్టును 159-158 తేడాతో భారత్ ఓడించింది. అలాగే 35 కిలో మీటర్ల మిక్స్డ్ వాక్ ఈవెంట్లోనూ భారత్ కాంస్య పతకం దక్కించుకుంది.

ఈ సారి 100 పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత అథ్లెట్ల బృందం ఆ దిశగా దూసుకెళ్తోంది. ఇంకా ఈవెంట్స్ జరగనున్న నేపథ్యంలో సునాయసంగా 100 పతకాలు అందుకునే అవకాశం ఉంది. ఇప్పటికే మహిళల 75 కేజీల బాక్సింగ్ కేటగిరీలో లవ్లీనా పతకం ఖాయం చేసుకుంది. జావెలిన్ త్రో ఈవెంట్లో గోల్డెన్ మ్యాన్ నీరజ్ చోప్రాపై భారీగానే అంచనాలు ఉన్నాయి.
బ్యాడ్మింటన్, క్రికెట్తో పాటు ఇతర ఈవెంట్లలోనూ భారత్కు పతకాలు వచ్చే అవకాశం ఉంది. అథ్లెటిక్స్లో కూడా మరి కొన్ని పతకాలు రావచ్చు.
ఆసియా గేమ్స్ మహిళల హాకీలో భారత జట్టు సెమీఫైనల్కు దూసుకెళ్లింది. వందన కటారియా, డీప్ గ్రేస్ ఎక్కా, దీపిక హ్యాట్రిక్లు సాధించడంతో తన చివరి పూల్ మ్యాచ్లో మంగళవారం 13-0తో హాంకాంగ్ను చిత్తు చేసింది.
భారత్ తరఫున వందన (2వ, 16వ, 48వ), డీప్ గ్రేస్ (11వ, 34వ, 42వ), దీపిక (4వ, 54, 58వ) గోల్స్ మోత మోగించారు. సంగీత కుమారి (27వ, 55వ) రెండు గోల్స్ కొట్టగా.. మోనిక (7వ), నవ్నీత్ (58వ) చెరో గోల్ సాధించారు. నాలుగు మ్యాచ్ల నుంచి 10 పాయింట్లతో భారత్ పూల్-ఎలో అగ్రస్థానం సాధించింది.
బ్యాడ్మింటన్లో భారత స్టార్ క్రీడాకారులు పి.వి.సింధు, హెచ్.ఎస్.ప్రణయ్, కిదాంబి శ్రీకాంత్ శుభారంభం చేశారు. స్వర్ణంపై గురిపెట్టిన ముగ్గురు స్టార్ షట్లర్లు ప్రిక్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లారు.
మంగళవారం మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ఏడో సీడ్ సింధు 21-10, 21-15తో చైవెన్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో అయిదో సీడ్ ప్రణయ్ 21-9, 21-12తో ముంఖ్బత్ (మంగోలియా)పై, శ్రీకాంత్ 21-16, 21-11తో లీ యున్ (కొరియా)పై గెలుపొందారు. మహిళల డబుల్స్లో గాయత్రి గోపీచంద్- ట్రీసా జాలీ 21-14, 21-12తో అమినత్ నబీహా- ఫతిమత్ నబాహా (మాల్దీవులు)పై, అశ్విని పొన్నప్ప- తనీషా క్రాస్టో 21-2, 12-2 (రిటైర్డ్)తో మైసా ఫతుహుల్లా- ఐషాత్ అఫ్నాన్పై నెగ్గి ప్రిక్వార్టర్స్ చేరుకున్నారు.