హాంగ్జౌ: ఆసియా గేమ్స్ 2023లో భారత్కు మరో బంగారం పతకం వరిచింది. ఈక్వస్ట్రియన్ విభాగంలో సుదీప్తి హజెలా, హృదయ్ విపుల్, అనూష్ గార్వాలా, దివ్యకృతి సింగ్లతో కూడిన భారత బృందం పసిడి సొంతం చేసుకుంది. 41 ఏళ్ల తర్వాత తొలిసారి ఈక్వస్టియన్ ఆటలో భారత్కు బంగారు పతకం దక్కింది.
మంగళవారం జరిగిన ఈక్వస్ట్రియన్ డ్రస్సేజ్ ఈవెంట్లో భారత బృందం దుమ్మురేపింది. ఆసియా క్రీడల్లో ఈక్వస్ట్రియన్ విభాగంలో భారత్కు ఇది నాలుగో బంగారు పతకం. మిగిలిన మూడు పతకాలు 1982 ఆసియా గేమ్స్లో దక్కడం విశేషం. మంగళవారం పోటీల్లో భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి.

సెయిలింగ్లో నేహా ఠాకూర్ రజతం సాధించగా.. ఎబాద్ అలీ, విష్ణు శరవనన్ కాంస్య పతకాలు అందుకున్నారు. ప్రస్తుతం భారత పతకాల సంఖ్య 14కు చేరుకుంది. ఇందులో 3 స్వర్ణాలు, 4 రజతాలు, 7 కాంస్య పతకాలు ఉన్నాయి. మెడల్స్ టేబుల్లో చైనా 78 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. భారత్ ఆరో స్థానంలో నిలిచింది.
భారత బాక్సర్ సచిన్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన 57 కేజీల విభాగంలో సచిన్ 5-0తో ఇండోనేషియాకు చెందిన అస్రి ఉదిన్ను మట్టికరిపించాడు. ఈస్పోర్ట్స్లో భారత ద్వయం అయాన్ బిస్వాస్, మయాంగ్ అగర్వాల్ స్ట్రీట్ ఫైటర్ నాకౌట్ రౌండ్ల నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఫెన్సింగ్లో భవాని దేవీ క్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలైంది.