హాంగ్జౌ: ఆసియా గేమ్స్ 2023లో భారత్ తొలి గోల్డ్ మెడల్ గెలుచుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్లో రుద్రాంక్ష్ పాటిల్, ఐశ్వరీ తోమర్, దివ్యాంశ్ పన్వార్లతో కూడిన భారత పురుషుల జట్టు స్వర్ణ పతకాన్ని సాధించింది. సోమవారం జరిగిన ఈ పోటీల్లో భారత టీమ్ క్వాలిఫికేషన్ ఫైనల్ రౌండ్లో 1893.7 స్కోర్తో అగ్రస్థానంలో నిలిచింది.
ఆ తర్వాతి స్థానంలో నిలిచిన ఇండోనేషియా(1890.1) సిల్వర్ మెడల్ సొంతం చేసుకోగా.. మూడో స్థానంలో నిలిచిన ఆతిథ్య చైనా(1888.2)కు కాంస్య పతకం దక్కింది.

ఈ ప్రదర్శనతో భారత షూటర్లు వ్యక్తిగత ఈవెంట్ ఫైనల్కు కూడా అర్హత సాధించారు. రుద్రాంక్ష్ పాటిల్ 632.5 స్కోర్తో మూడో స్థానంలో నిలవగా.. ఐశ్వరీ తోమర్ 631.6 స్కోర్తో ఐదో స్థానంలో నిలిచాడు. దివ్యాంశ్ పన్వార్ 629.6 స్కోర్తో చివరి క్వాలిఫయింగ్ స్పాట్ అందుకున్నాడు.
1893.7 స్కోర్తో భారత షూటింగ్ త్రయం చైనా ప్రపంచ రికార్డును అధిగమించింది. ఈ ఏడాది ఆగస్టులో చైనా షూటింగ్ టీమ్ 1893.3 స్కోర్తో ప్రపంచ రికార్డు నమోదు చేయగా.. భారత షూటింగ్ త్రయం అధిగమించింది. వ్యక్తిగత విభాగం ఫైనల్ మ్యాచ్లు కూడా ఈ రోజు జరగనున్నాయి.
ఈ ఆసియా గేమ్స్లో భారత రోయర్లు తమ జోరును కొనసాగిస్తున్నారు. సోమవారం జరిగిన ఫైనల్స్లో జస్విందర్ సింగ్, భీమ్ సింగ్, పునిత్ కుమార్, ఆశిష్లతో కూడిన భారత పురుషుల రోయింగ్ టీమ్ కాంస్య పతకం గెలిచింది. 6 నిమిషాల 10.81 సెకన్ల టైమింగ్తో భారత టీమ్ మూడో స్థానంలో నిలిచి మెడల్ సొంతం చేసుకుంది. ఈ పోటీల్లో చైనా బంగారు పతకం గెలవగా.. ఉజ్బెకిస్థాన్ సిల్వర్ సొంతం చేసుకుంది.
పురుషుల సింగిల్స్ స్కల్ ఫైనల్లో భారత్కు చెందిన బాల్రాజ్ పన్వార్ తృటిలో పతకాన్ని చేజార్చుకున్నాడు. నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ పోటీల్లో చైనా రోయర్ బంగారు పతకం గెలవగా.. జపాన్ రోయర్ సిల్వర్, హాంగ్ కాంగ్ రోయర్ కాంస్య పతకాలు అందుకున్నారు.
సొమవారం గోల్డ్ మెడల్తో పాటు కాంస్య పతకం గెలవడంతో భారత పతకాల సంఖ్య ఎనిమిదికి చేరింది. పతక పోటీలు మొదలైన ఆదివారం భారత్ మూడు సిల్వర్ సహా ఐదు మెడల్స్ కైవసం చేసుకుంది. రోయింగ్లో రెండు సిల్వర్, ఒక బ్రాంజ్, షూటింగ్లో ఒక సిల్వర్, ఒక బ్రాంజ్ సాధించిన విషయం తెలిసిందే.
భారత మహిళల క్రికెట్ జట్టు కూడా ఫైనల్ చేరి మరో పతకం ఖాయం చేసుకుంది. శ్రీలంకతో మరికాసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తే బంగారు పతకం దక్కనుంది. ఓడితే రజత పతకం సొంతమవుతోంది.