హాంగ్జౌ: ఆసియా గేమ్స్ 2023 అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గత శనివారం చైనాలో హాంగ్జౌ వేదికగా 19వ ఆసియా క్రీడలు మొదలయ్యాయి. ఈ గేమ్స్ ఆరంభ వేడుకల్లో ఆసియా వ్యాప్తంగా ఉన్న దేశాల అథ్లెట్లు అందరూ పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా జరుగుతున్న ప్రారంభ వేడుకల్లో తమ దేశ జెండాను పట్టుకొని తిరుగుతున్నారు.
పతకం గెలిచి దేశ జెండాను రెపరెపలాడించాలనే లక్ష్యంతో ముందుకు నడుస్తున్నారు. అందరిలానే హాంగ్ కాంగ్కు చెందిన 12 ఏళ్ల చెస్ ప్లేయర్ లియు టియాన్- యి కూడా ఎంతో సంతోషంగా ఈ వేడుకల్లో పాల్గొంది. పసిప్రాయంలోనే ఇంత పెద్ద టోర్నీలో ఆడే అవకాశం దక్కడంపై తెగ సంబరిపడిపోయింది.

ఈ ఆరంభ వేడుకలకు హాజరైన జనాలను.. బరిలోకి దిగే అథ్లెట్లను చూసి తనకు గొప్ప అవకాశం వచ్చిందని భావించింది. ఆరంభ వేడుకలను చూసిన ఆ చిన్నారి సంబరం క్షణాల్లోనే ఆవిరైంది. తన మొబైల్ ఫోన్ పోయిందనే విషయం గుర్తించి తీవ్ర బాధకు లోనయ్యింది. టెన్నిస్ సెంటర్లో డిన్నర్ చేసిన తర్వాత మొబైల్ పోయిందనే విషయాన్ని లియు గుర్తించింది.
బ్యాగ్లో పెట్టిన మొబైల్ కనిపించకుండా పోయిందని గుర్తించి ఫోన్ చేసింది. కానీ అది అప్పటికీ స్విచ్చాఫ్ కావడంతో తన టీమ్ లీడర్ ఎడ్వర్డ్కు తెలియజేసింది. ముందుగా ఎడ్వర్డ్ అంత అజాగ్రత్తగా ఉంటే ఎలా? అని లియూపై అరిచాడు. ఇంత పెద్ద మైదానంలో.. ఇంత మంది మధ్య మొబైల్ వెతకడం.. దొరికి పెట్టడం కష్టమని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
కానీ ఆ చిన్నారి బాధను చూసి తన కోపాన్ని తగ్గించుకొని మరీ ఆసియా గేమ్స్ వాలంటరీ టీమ్ను సంప్రదించాడు. మొబైల్ పోయిన తీరును వారికి వివరించాడు. ఎడ్వర్డ్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన వాలంటరీ టీమ్.. మొబైల్ ఫోన్ను కనిపెట్టడమే లక్ష్యంగా పెట్టుకొని పనిని ప్రారంభించింది. 5,23,000 చదరపు అడుగులు, 10 వేల సీట్ల సామర్థ్యం ఉన్న స్టేడియంలో అనువనువు గాలించింది.
కానీ మొబైల్ దొరుకుతుందని ఎవరికీ ఆశల్లేవ్. ఎడ్వర్డ్ కూడా కష్టమేనని భావించాడు. కానీ 24 గంటల సెర్చ్ తర్వాత ఆదివారం మూడు గంటల సమయంలో మొబైల్ దొరికినట్లు ఎడ్వర్డ్కు వాలంటీర్ టీమ్ సమాధానం ఇచ్చింది. చెత్త బుట్టలో మొబైల్ దొరికిందని చెప్పింది. ఈ విషయాన్ని ఏషియన్ గేమ్స్ అధికారులు ఎక్స్ వేదికగా ప్రపంచంతో పంచుకున్నారు.
మొబైల్ ఫోన్ కోసం వాలంటీర్లు చెత్త బ్యాగ్లను సెర్చ్ చేశారని, 12 ఏళ్ల లియూ మొబైల్ కనిపెట్టారని క్యాప్షన్గా రాసుకొచ్చింది. 24 గంటల్లోనే ఆమె ఫోన్ కనిపెట్టామని తెలిపింది. ఇదో గొప్ప అనుభూతని క్యాప్షన్గా పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారింది.