హాంగ్జౌ: ఆసియా గేమ్స్ 2023లో భారత అథ్లెట్లు దుమ్మురేపుతున్నారు. ఇప్పటికే 67 పతకాలను ఖాతాలో వేసుకొని టార్గెట్ 100 దిశగా దూసుకెళ్తున్నారు. మంగళవారం భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్ ఈవెంట్లో సిల్వర్ మెడల్ గెలిచిన పారుల్ చౌదరి.. 5000 మీటర్ల మహిళల పరుగు పందెంలో బంగారు పతకం సాధించింది.
మిక్స్డ్ 4X400 రిలే పోటీల్లో సిల్వర్ మెడల్ గెలిచిన విథ్యా రామ్రాజ్, మహిళల 400 మీటర్ల హర్డెల్స్లో కాంస్య పతకం సొంతం చేసుకుంది. తద్వారా పరుణుల రాణి పీటీ ఉషా రికార్డును విథ్యా రామ్రాజ్ సమం చేసింది. 39 ఏళ్ల క్రితం జరిగిన ఆసియా గేమ్స్లో పీటీ ఉషా మెడల్ సాధించింది.

పురుషుల స్క్వాష్ సింగిల్స్లో భారత స్క్వాష్ ప్లేయర్ సౌరవ్ గోషల్ సెమీ ఫైనల్కు దూసుకెళ్లాడు. 57 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్ చేరిన భారత బాక్సర్ సచిన్ సివాచ్ 1-4 తేడాతో ఓటమి పాలయ్యాడు. ఈ పోరులో గెలిచి ఉంటే సచిన్ సివాచ్కు కనీసం కాంస్య పతకమైనా దక్కేది.
స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో అనహాత్- అభయ్ జోడీ, కొరియన్ జోడిపై 2-1 విజయంతో సెమీస్కు దూసుకెళ్లింది. అలాగే మరో భారత స్క్వాష్ మిక్స్డ్ డబుల్ జోడీ దీపికా పల్లికల్-హరీందర్ పాల్ సింగ్ కూడా సెమీస్ చేరుకున్నారు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్, ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.

డెకథ్లాన్ పురుషుల ఈవెంట్లో భారత అథ్లెట్ తేజస్వీన్ శంకర్ సిల్వర్ మెడల్ సాధించాడు. 1974 తర్వాత పురుషుల డెకాథ్లాన్ ఈవెంట్లో భారత్కు దక్కిన పతకం ఇదే కావడం విశేషం. పురుషుల 800 మీటర్ల పరుగు పందెంలో మహ్మద్ ఆఫ్సల్ సిల్వర్ మెడల్ గెలిచాడు. పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్లో ప్రవీణ్ చిత్రావెల్కు బ్రాంజ్ మెడల్ దక్కింది.
భారత్ ఖాతాలో 15 స్వర్ణాలు, 25 రజతాలు, 27 కాంస్య పతకాలున్నాయి.