బ్యాంకాక్: ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తెలుగు అమ్మాయి యెర్రాజి జ్యోతి మరో పతకం సాధించింది. 100 మీటర్ల హార్డిల్స్లో బంగారు పతకం నెగ్గిన తొలి ఇండియన్గా చరిత్ర సృష్టించిన ఈ వైజాగ్ అమ్మాయి.. తాజాగా 200 మీటర్ల ఈవెంట్లో సిల్వర్ మెడల్ నెగ్గింది. 200 మీటర్ల హార్డిల్స్ పోటీలో జ్యోతి 23.13 సెకన్ల టైమింగ్తో రెండో స్థానంలో నిలిచింది.
మహిళల 4X400 మీటర్ల రిలేలో ఆంధ్ర అమ్మాయి దండి జ్యోతిక శ్రీతో కూడిన భారత జట్టు 3 నిమిషాల 1.56 సెకండ్లతో మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్మెడల్ సొంతం చేసుకుంది.

మరోవైపు 3000 మీటర్లు స్టీపుల్ఛేజ్ పోటీలో ఛాంపియన్గా నిలిచిన పారుల్ చౌదరి.. మహిళల 5000మీ. రేసులో రజత పతకంతో సత్తాచాటింది. 15 నిమిషాల 52.35 సెకన్లలో ఆమె రేసును ముగించింది. ఇదే విభాగంలో అంకిత (16:03.33నిమిషాలు) బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకుంది. మహిళల షాట్పుట్లో అభ ఖాతువా జాతీయ రికార్డు (18.06మీటర్లు)ను సమం చేసే ప్రదర్శనతో సిల్వర్ మెడల్ అందుకుంది.
వెటరన్ మన్ప్రీత్ కౌర్ (17మీటర్ల) బ్రాంజ్ మెడల్ నెగ్గింది. పురుషుల జావెలిన్ త్రోలో డీపీ మను (81.01మీటర్లు) రజతం గెలవగా... 800మీటర్లు పరుగులో పురుషుల్లో కిషన్ కుమార్ (1:45.88నిమిషాలు), మహిళల్లో కేఎం చందా (2:01.58నిమిషాలు) సిల్వర్ మెడల్స్తో అదరగొట్టారు. 5000మీటర్ల రేసులో గుల్వీర్ సింగ్ (13:48.33నిమిషాలు) కాంస్యంతో మెరిశాడు.
ఈ ఛాంపియన్షిప్లో భారత్.. మొత్తం 6 స్వర్ణాలు, 12 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి 27 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. 16 గోల్డ్, 11 సిల్వర్, 10 బ్రాంజ్ మెడల్స్తో మొత్తం 37 పతకాలు సాధించిన జపాన్ అగ్రస్థానంలో నిలవగా.. 8 స్వర్ణాలతో మొత్తం 22 పతకాలు సాధించిన చైనా రెండో స్థానంలో నిలిచింది.