హాంగ్జౌ: ఆసియా గేమ్స్లో భారత పురుషుల వాలీబాల్ టీమ్ దుమ్మురేపుతోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన పూల్-సి మ్యాచ్లో భారత్ 3-2 తేడాతో గత ఎడిషన్ సిల్వర్ మెడలిస్ట్ సౌత్ కొరియాను ఓడించి సంచలన విజయాన్నందుకుంది.
ఐదు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో అమిత్ గులియా, అశ్వల్ రాయ్ కీలక పాయింట్లతో టీమ్ను గెలిపించారు. మంగళవారం తొలి మ్యాచ్లో భారత్ 3-0తో కంబోడియాను ఓడించి ఐదు పాయింట్లో పూల్ సీలో టాప్ ప్లేస్ సాధించి నాకౌట్కు అర్హత సాధించింది. తదుపరి రౌండ్లో భారత్, చైనీస్ తైపీ లేదా మంగోలియాతో తలడనుంది.

ఆసియా గేమ్స్లో భారత వాలీ బాల్ టీమ్ ఇప్పటి వరకు ఒకే ఒక్క మెడల్ సాధించింది. 1986లో కాంస్య పతకం నెగ్గింది. గత ఎడిషన్లో 12వ స్థానంతో సరిపెట్టుకుంది. మరోవైపు రోయింగ్లో భారత పురుషుల ఫోర్ కాక్స్లెస్ టీమ్ నేరుగా ఫైనల్కు అర్హత సాధించింది. జవీందర్ సింగ్, భీన్ సింగ్, పునీత్ కుమార్, ఆశీష్తో కూడిన జట్టు హీట్స్లో టాప్ ప్లేస్ సాధించింది.
మహిళల కాక్స్లెస్, మెన్స్ కాక్స్డ్ ఎయిట్స్ టీమ్ కూడా ఫైనల్ రేసుకు అర్హత సాధించింది. ఆసియా గేమ్స్ అధికారికంగా శనివారం ప్రారంభం కానున్నాయి. అయితే కొన్ని ఈవెంట్స్ ఇప్పటికే మొదలయ్యాయి.
ఆసియా గేమ్స్ ఆరంభ వేడుకల్లో భారత పతకదారులుగా పురుషుల హాకీ టీమ్ కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్, ఒలింపిక్ మెడలిస్ట్ బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ ఎంపికయ్యారు. శనివారం జరిగే ఈ వేడుకల్లో ఈ ఇద్దరూ త్రివర్ణ పతాకంతో భారత అథ్లెట్ల ముందుండి నడిపించనున్నారు. ఈ మెగా ఈవెంట్కు ఇద్దరు ఫ్లాగ్ బేరర్లు ఉండాలని భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) నిర్ణయించింది. కాగా, ఆసియా గేమ్స్లో భారత్ ఈసారి అత్యధికంగా 655 మంది అథ్లెట్లను బరిలోకి దింపుతోంది.