హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో 2023 భారత్ ప్రస్థానం ముగిసింది. పోటీలు రేపటి వరకు జరగనున్నా.. భారత్ అథ్లెట్ల ఈవెంట్ల పూర్తయ్యాయి. 72 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత్ 107 పతకాలతో చరిత్ర సృష్టించింది. టార్గెట్-100 పేరటి బరిలోకి దిగిన భారత్ అథ్లెట్లు చరిత్రలో నిలిచిపోయే ప్రదర్శన కనబర్చారు.
సెప్టెంబర్ 23న ప్రారంభమైన ఆసియా గేమ్స్.. ఆదివారం(అక్టోబర్ 8న) ముగియనున్నాయి. చివరి రోజు ఆర్టిస్టిక్ స్విమ్మింగ్, మార్షల్ ఆర్ట్స్లో కరాటే పోటీలు జరగనున్నాయి. ఈ ఈవెంట్లలో భారత్ నుంచి పోటీ పడేవారు లేరు.

శనివారం జరిగిన పోటీల్లో భారత క్రికెట్ టీమ్తో పాటు మహిళల, పురుషుల కబడ్డీ జట్లు స్వర్ణపతకాలు సాధించాయి. భారత మహిళల, పురుషుల చెస్ టీమ్ సిల్వర్ మెడల్ దక్కించుకున్నాయి.
హారికా ద్రోణవల్లి, కోనేరు హంపి, వంతిక అగర్వాల్, వైశాలి బాబు, సవితా శ్రీలతో కూడిన భారత మహిళల చెస్ టీమ్ 15/18 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ప్రజ్ఞానంద, గుకేశ్, విడిల్, గుజ్రాతీ, అర్జున్, హరికృష్ణ సిల్వర్ మెడల్ గెలిచారు. ఈ రెండు పతకాలతో కలిపి భారత్ ఖాతాలో మొత్తం 107 మెడల్స్ చేరాయి.
అంతకుముందు రెజ్లింగ్ 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా ఫైనల్లో ఓడి సిల్వర్ మెడల్ గెలిచాడు. ఏషియన్ గేమ్స్లో రజతం సాధించి ఏకైక ప్లేయర్ దీపక్ పూనియా మాత్రమే. ఫైనల్లో అతను ఇరాన్ రెజ్లర్ చేతిలో ఓటమిపాలయ్యాడు. పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్లో తెలుగు తేజం సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి-చిరాగ్ శెట్టి స్వర్ణ పతకంతో చరిత్ర సృష్టించారు.
ఆర్చరీలో జ్యోతి వెన్నం, ఓజాస్ డియోటెల్ స్వర్ణం గెలవగా అభిషేక్ వర్మ సిల్వర్, అదితి స్వామి బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకున్నారు. భారత మహిళా హాకీ టీమ్ బ్రాంజ్ మెడల్ గెలిచింది. శనివారం భారత్ 12 పతకాలు గెలవగా.. మెడల్ సంఖ్య 107కు చేరింది. ఇందులో 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.
1962 ఆసియా గేమ్స్లో మూడో స్థానంలో నిలిచిన భారత్కు మళ్లీ ఇదే బెస్ట్ పొజిషన్ కావడం విశేషం. చివరి రోజు జరిగే ముగింపు వేడుకల్లో పాల్గొని భారత జట్టు స్వదేశం రానుంది.
ఆసియా గేమ్స్లో 100 పతకాలు సాధించిన భారత అథ్లెట్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. శతకవీరులకు వందనమంటూ ట్విటర్ వేదికగా కొనియాడారు. అక్టోబర్ 10న అథ్లెట్లకు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
'ఆసియా గేమ్స్లో భారత్ సత్తా చాటింది. పతకాల సంఖ్య 100కు చేరడంతో దేశ ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన అథ్లెట్ల కృషికి నా హృదయ పూర్వక అభినందనలు. దేశం గర్వపడేలా చేశారు. 10వ తేదీన మా ఆసియా క్రీడల బృందానికి ఆతిథ్యం ఇవ్వడానికి.. మన అథ్లెట్లతో సంభాషించడానికి ఎదురుచూస్తున్నా'అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.