భారత జావెలిన్ త్రోయర్, గోల్డెన్ మ్యాన్ నీరజ్ చోప్రా బయోపిక్కు సెట్ అయ్యే హీరో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ అని పాకిస్థాన్ బళ్లెం వీరుడు, గోల్డ్ మెడలిస్ట్ అర్షద్ నదీమ్ అన్నాడు. పారిస్ ఒలింపిక్స్ 2024లో నీరజ్ చోప్రా రజత పతకం గెలవగా.. పాకిస్థాన్ బళ్లెం వీరుడు అర్షద్ నదీమ్ బంగారు పతకం సాధించిన విషయం తెలిసిందే.
ఈటెను 92.97 మీటర్ల దూరం విసిరిన నదీమ్.. ఒలింపిక్స్లో సరికొత్త రికార్డ్ నమోదు చేశాడు. మరోవైపు నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్ 2020 కంటే మెరుగైన ప్రదర్శన చేసినా అర్షద్ నదీమ్ను ధాటలేకపోయాడు. ఈటెను 89.45 మీటర్లు మాత్రమే విసిరి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ సారి గోల్డ్ మెడల్ సాధించనందుకు తనను క్షమించాలని భారత ప్రజలను నీరజ్ చోప్రా కోరాడు.

ఈ విజయానంతరం అధికారిక బ్రాడ్కాస్టర్ నీరజ్ చోప్రా, అర్షద్ నదీమ్లతో ప్రత్యేకంగా మాట్లాడింది. ఈ సందర్భంగా నీరజ్ చోప్రా బయోపిక్కు సరిపోయే హీరో ఎవరు? అని అర్షద్ నదీమ్ను ప్రశ్నింగా.. అతను షారుఖ్ ఖాన్ పేర్ చెప్పాడు. మరోవైపు అర్షద్ నదీమ్ బయోపిక్కు అమితాబ్ బచ్చన్ సూట్ అవుతాడని నీరజ్ చోప్రా తెలిపాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
మరోవైపు ఒలింపిక్ ప్రదర్శనపై నీరజ్ చోప్రా తల్లి రియాక్షన్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రజతం సాధించిన కొడుకును ప్రశంసిస్తూనే, బంగారు పతకం సాధించిన అర్షద్ నదీమ్ కూడా తన కొడుకు లాంటి వాడేనని ఆమె కొనియాడింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. నీరజ్ చోప్రా తల్లిపై అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
నీరజ్ చోప్రా తల్లి రియాక్షన్పై అర్షద్ నదీమ్ కూడా స్పందించాడు. తాజాగా పాకిస్తాన్ చేరుకున్న అర్షద్ మీడియాతో మాట్లాడాడు. 'అమ్మ ఎవరికైనా అమ్మే. ఆమె అందరి గురించి ప్రార్థిస్తుంది. నీరజ్ చోప్రా తల్లికి నా ధన్యవాదాలు. ఆమె నాకు కూడా అమ్మ లాంటిదే. ప్రపంచ వేదికపై జావెలిన్ త్రో విభాగంలో మెరుగైన ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లు ఇద్దరం దక్షిణాసియాకు చెందిన వాళ్లమే' అని అర్షద్ నదీమ్ చెప్పుకొచ్చాడు.