వరల్డ్ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్లో భారత ఆర్చర్ శీతల్ దేవి స్వర్ణ పతకం సాధించింది. ఈ విజయంతో సరికొత్త చరిత్రను లిఖించింది. సౌత్కొరియాలోని గ్వాంగ్జు వేదికగా జరుగుతున్న వరల్డ్ పారా ఆర్చరీ 2025 ఛాంపియన్షిప్లో మహిళల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో శీతల్ దేవి విజేతగా నిలిచి స్వర్ణం పతకం గెలిచింది. పుట్టకతోనే చేతులు లేకున్నా.. శీతల్ దేవి కాళ్లు, నోటి సాయంతో విల్లు విసరగలదు. ఫైనల్లో వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ను శీతల్ దేవి ఓడించింది.
ఉత్కంఠగా సాగిన ఈ ఫైనల్లో శీతల్ దేవి 146-143 తేడాతో టర్కీకి చెందిన వరల్డ్ నంబర్ వన్ పారా ఆర్చర్ ఓజ్నూర్ క్యుర్ కీర్తిని ఓడించింది. తొలి రౌండ్ 29-29తో టై కాగా.. రెండో రౌండ్లో శీతల్ దేవి మూడు పర్ఫెక్ట్ 10 పాయింట్స్ సాధించి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.ఆ తర్వాత చివరి వరకు అదే ఆధిక్యాన్ని కొనసాగించింది. ఆఖరి రౌండ్లోనూ మూడు సార్లు 10 పాయింట్స్ సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది.

ఈ ఛాంపియన్షిప్లో శీతల్ దేవి సాధించిన మూడో పతకం ఇది. గతంలో ఆమె దోమన్ కుమార్తో కలిసి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కాంస్య పతకం, సరితతో కలిసి మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో సిల్వర్ మెడల్ గెలుచుకుంది. అంతేకాకుండా 2023 వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఓస్నూర్ క్యుర్ కీర్తిపై ఎదురైన పరాజయానికి తాజా విజయంతో ప్రతీకారం తీర్చుకుంది.
ఫోకోమెలియా అనే అరుదైన వ్యాధి కారణంగా చేతులు లేకుండా జన్మించిన శీతల్ దేవి ప్రయాణం స్ఫూర్తిదాయకం. 2019లో కిష్త్వార్లో జరిగిన యువజన కార్యక్రమంలో భారత సైన్యంలోని రాష్ట్రీయ రైఫిల్స్ ఆమె ప్రతిభను గుర్తించింది. ఆ తర్వాత అభిలాషా చౌదరి, కుల్దీప్ వాధ్వాన్ ఆధ్వర్యంలో శిక్షణను ప్రారంభించింది. తన పాదాలు, నోటిని ఉపయోగించి విల్లును విసరడం ఆమెకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. దాంతో త్వరగానే అంతర్జాతీయ స్థాయిలో ఆడే అవకాశం దక్కింది.
ఆసియా పార్ గేమ్స్ 2022లో శీతల్ దేవి రెండు స్వర్ణాలు, ఒక రజత పతకం సాధించింది. పారిస్ పారాలింపిక్స్ 2024లో మిక్స్డ్ డబుల్స్లో కాంస్య పతకం గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. ఈ విజయాలతో ఆమెకు అత్యున్నత క్రీడా పురస్కారమైన అర్జున అవార్డు దక్కింది. బీబీసీ ఎమర్జింగ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2024ను కూడా శీతల్ దేవి గెలుచుకుంది.