దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు తనకివ్వాలని భారత స్టార్ ఆర్చర్, తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ విజ్ఞప్తి చేసింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు తన పేరు పరిశీలించాలని కేంద్ర క్రీడల మంత్రి మాన్సుఖ్ మాండవీయకు సురేఖ సోమవారం లేఖ రాసింది. ఆర్చరీ ప్రపంచకప్లో సురేఖ హ్యాట్రిక్ స్వర్ణ పతకాలు సొంతం చేసుకుంది.
ప్రపంచ ఆర్చరీ చరిత్రలోనే ఈ ఫీట్ సాధించిన మూడో క్రీడాకారిణిగా చరిత్రకెక్కింది. గత 14 ఏళ్లుగా ఆర్చరీలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ 62 పతకాలు సాధించానని క్రీడల మంత్రికి రాసిన లేఖలో సురేఖ పేర్కొంది. ఆసియా క్రీడల్లో ఐదు బంగారు పతకాలు గెలిచానని, వరల్డ్ ఛాంపియన్షిప్లో 8 పతకాలు సాధించానని గుర్తు చేసింది. ఈ ఏడాది కాంపౌండ్ విభాగంలో రెండో ర్యాంకు కూడా సాధించానని ప్రస్తావించింది. గత కొన్నేళ్లుగా ఖేల్ రత్న అవార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నానని, నిబంధనల ప్రకారం అత్యధిక పాయింట్లు కలిగి ఉన్నప్పటికీ తుది జాబితాలో తన పేరు ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

గత నాలుగేళ్ల ప్రదర్శనకు గాను నాకు 132 పాయింట్లు ఉన్నాయని, ఈ లెక్కన ఖేల్ రత్న అవార్డు రేసులో అగ్రస్థానంలో ఉంటానని భావిస్తున్నాని పేర్కొంది. ఇప్పటి వరకు ఆర్చరీలో ఎవరీకి ఖేల్ రత్న పురస్కారం లభించలేదని, ఈ అవార్డు లభిస్తే భారత ఆర్చరీకి మంచి ప్రోత్సాహం దక్కుతుందని మాండవీయకు పంపిన ఈమెయిల్లో సురేఖ పంపింది.
ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా పురస్కారాల ప్రకటనకు రంగ సిద్దమైంది. సుప్రీం కోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ వి. రామసుబ్రహ్మణ్యం సారథ్యంలోని 12 మంది సభ్యుల సెలెక్షన్ కమిటీ అర్జున, ఖేల్ రత్న, ద్రోణా చార్య, ధ్యాన్ చంద్ తదితర అవార్డులకు సంబంధించిన నామినేషన్ల జాబితాలను కేంద్ర ప్రభుత్వానికి అందించింది. ఒకటి రెండు మార్పులు మినహా ఇదే జాబితా ఖాయమయ్యే అవకాశం ఉంది.
ఈ నామినేషన్స్లో తెలంగాణ పారా అథ్లెట్, వరంగల్ బిడ్డ దీప్తి జివాంజీకి చోటు దక్కింది. పారిస్ పారాలింపిక్స్లో 400 మీటర్ల పరుగు(టీ20) కేటగిరిలో కాంస్యం గెలుచుకున్న దీప్తిని అర్జున అవార్డ్కు సెలెక్షన్ కమిటీ సిఫార్స్ చేసింది. ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారమైన ఖేల్ రత్నకు భారత పురుషుల హాకీ టీమ్ కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్తో పాటు పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ను ప్రతిపాదించారు.