
తగ్గేదేలే...
పారాలింపియన్ల పట్టుదల ముందు వైకల్యం ఎప్పుడూ ఓడిపోతూనే ఉంది. పారాలింపిక్ దిగ్గజం, బ్రెజిల్ స్విమ్మర్ డానియెల్ డియాస్ వరుసగా నాలుగో మెగా ఈవెంట్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. 24 పతకాలు గెలుచుకున్న డానియెల్ ఈ సారి ఆ సంఖ్యను 30కి చేర్చుతాడనే అంచనాలున్నాయి. అమెరికా మహిళా స్విమ్మర్లు జెస్సికా లాంగ్, మెకెంజీ కోన్లు కూడా టోక్యో కొలనులో రియో టైటిళ్లను నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. జర్మనీ లాంగ్జంపర్, మార్కస్ రెమ్, ఇరాన్ ఆర్చర్ జహ్రా నెమటి, బ్రిటన్ వీల్చైర్ టెన్నిస్ ప్లేయర్ జోర్డాన్ విలీ, జపాన్ పారాథ్లెట్ సాటో తొమకి తదితర స్టార్లతో టోక్యో వేదిక మురిసిపోనుంది. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 5 వరకు 13 రోజుల పాటు జరిగే పారా విశ్వక్రీడల్లో 163 దేశాలకు చెందిన సుమారు 4500 మంది అథ్లెట్లు పాల్గొననున్నారు. 22 క్రీడలకు సంబంధించి 540 ఈవెంట్లలో పోటీలు జరగనున్నాయి.

తంగవేలు పతాకధారి
ఐదుగురు అథ్లెట్లు, ఆరు మంది అధికారులు మొత్తం 11 మందితో కూడిన భారత జట్టు మార్చ్పాస్ట్లో పాల్గొననుంది. పతాకధారి మరియప్పన్ తంగవేలు మన జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఇరాన్ తర్వాత 17వ దేశంగా భారత్ స్టేడియంలోకి అడుగుపెట్టనుంది. పారాలింపిక్స్ మార్చ్పాస్ట్లో అథ్లెట్లకు పరిమితులేమీ లేవు. అయితే టోక్యోకు భారత్ నుంచి ఇప్పటివరకు కేవలం ఏడుగురు అథ్లెట్లు మాత్రమే వచ్చారు. ఇందులో ఇద్దరు టేబుల్ టెన్నిస్ ప్లేయర్లు సోనల్ పటేల్, భవిన పటేల్లకు మరుసటి రోజు (బుధవారం) పోటీలున్నాయి. దీంతో వారిని మినహాయించి ఐదుగురు అథ్లెట్లకు జతగా ఆరుగురు అధికారులు మార్చ్పాస్ట్ చేస్తారని భారత పారాలిం పిక్ కమిటీ కార్యదర్శి, చెఫ్ డి మిషన్ గుర్శరణ్ చెప్పా రు. మువ్వన్నెల పతాకధారి మరియప్పన్ తంగవేలుతో పాటు వినోద్ కుమార్ (డిస్కస్ త్రో), టెక్ చంద్ (జావెలిన్ త్రో), జైదీప్, సకీనా ఖాతూన్ (పవర్ లిఫ్టర్లు)లు ప్రారంభోత్సవంలో కవాతు చేయనున్నారు.

ఆటగాళ్లు లేకున్నా అఫ్గాన్ జెండా రెపరెపలు
అఫ్గానిస్తాన్లో పౌర ప్రభుత్వం కూలి... తాలిబన్ల తుపాకి రాజ్యం నడుస్తోంది. అక్కడి భీతావహ పరిస్థితులు, పౌర విమాన సేవలు లేక ఆ దేశ అథ్లెట్లు ఎవరూ పారాలింపిక్స్లో పాల్గొనడం లేదు. అయినాసరే వారి జాతీయ పతాకం మాత్రం పారాలింపిక్స్లో రెపరెపలాడనుందని అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ చీఫ్ అండ్రూ పార్సన్స్ స్పష్టం చేశారు. సంఘీభావానికి సంకేతంగా అఫ్గాన్ జాతీయ జెండా ప్రారంభవేడుకల్లో ఎగురుతుందని చెప్పారు. ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రతినిధి అఫ్గాన్ పతాకాధారిగా మార్చ్పాస్ట్లో పాల్గొన్నారు.

15 మెడల్స్ లక్ష్యంగా..
1972 నుంచి పారాలింపిక్స్లో బరిలోకి దిగుతున్న ఇండియా ఇప్పటివరకు 12 పతకాలు సాధించింది. ఇందులో 2016 రియో గేమ్స్లో రెండు గోల్డ్, ఒక సిల్వర్, ఒక బ్రాంజ్తో 43వ ప్లేస్లో నిలిచింది. అయితే ఈసారి ఆ సంఖ్యను మార్చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 5 గోల్డ్ మెడల్స్తో కలిపి 15 పతకాలు గెలవాలని ప్లాన్స్ చేస్తోంది. ఇందుకోసం 54 మంది బరిలోకి దిగుతుండగా, 9 క్రీడాంశాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కరోనా నేపథ్యంలో ఈసారి చాలా దేశాలు గేమ్స్ నుంచి వైదొలిగాయి. దీంతో ఈసారి ఇండియా టాప్-25లో ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

టాప్లో మనోళ్లే..
రియో గేమ్స్లో గోల్డ్ మెడల్స్ నెగ్గిన జావెలిన్ త్రోయర్ స్టార్ ప్లేయర్ దేవేంద్ర ఝఝారియా, హైజంపర్ మరియప్పన్ తంగవేలు.. ఇండియన్ బృందాన్ని ముందుండి నడిపించనున్నారు. దీనికితోడు గ్లోబల్ ర్యాంకింగ్స్లోనూ ఇండియన్ అథ్లెట్లే టాప్లో ఉన్నారు. నలుగురు అథ్లెట్లు తమ క్రీడాంశాల్లో నంబర్వన్ ప్లేస్లో ఉండగా, ఆరుగురు సెకండ్ పొజిషన్లో మరో 10 మంది నంబర్ త్రీ ర్యాంక్ల్లో ఉన్నారు. దీంతో ఇండియన్ అథ్లెట్లపై అంచనాలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి.


Click it and Unblock the Notifications












