న్యూఢిల్లీ: ఒలింపిక్స్ 2020 సన్నాహకాల్లో భాగంగా నేషనల్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) నిర్వహించిన కరోనా పరీక్షల్లో మొత్తం 30 మంది క్రీడాకారులు, సపోర్ట్ స్టాఫ్ కరోనా బారిన పడ్డారు. పటియాల, బెంగళూరుల్లోని నేషనల్ సెంటర్స్ ఎక్సెల్లెన్స్ల్లోని 741 మంది క్రీడాకారులు, సహాయక సిబ్బందికి ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించగా 30 మందికి పాజిటీవ్ అని తేలింది. అయితే టోక్యో ఒలింపిక్స్ వెళ్లే ఏ ఆటగాడు కూడా కరోనా భారిన పడకపోవడం సానుకూలాంశం.
భారత పురుషుల బాక్సింగ్ చీఫ్ కోచ్ సీఏ కుట్టప్ప, షాట్పుట్ కోచ్ మోహిందర్ సింగ్తో సహా 30 మందికి కరోనా సోకిందని సాయ్ ప్రకటించింది. పటియాలలో 313 పరీక్షలు నిర్వహించగా.. 26 మందికి పాజిటివ్ వచ్చిందని, బెంగళూరులో 428 మందికి పరీక్షలు నిర్వహిస్తే నలుగురు వైరస్ బారిన పడ్డారని పేర్కొంది. ఇక రెండు సెంటర్లలోని ఓలింపిక్స్ వెళ్లే ఆటగాళ్లు, కోచ్లకు నెగటీవ్ వచ్చిందని స్పష్టం చేసింది. కరోనా బారిన పడిన బాక్సర్ల జాబితాలో ఆసియా సిల్వర్ మెడలిస్ట్ దీపక్ కుమార్, ఇండియా ఓపెన్ గోల్డ్ మెడలిస్ట్ సంజిత్ ఉన్నారు.