
బర్మింగ్హామ్: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ బరిలోకి దిగిన శ్రీలంక అథ్లెట్లు కనిపించకుండా పోవడం చర్చనీయాంశమైంది. 10 మంది సభ్యులు ఈవెంట్స్ ముగిసిన తర్వాత అదృశ్యమయ్యారని శ్రీలంక అధికారులు ప్రకటించారు. ఇందులో తొమ్మిది మంది అథ్లెట్లు ఉండగా.. ఒకరు మేనేజర్ అని తెలిపారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు వెళ్లడం ఇష్టం లేకనే ఈ పని చేసారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్రిటన్లోనే ఉండేందుకు వారు ఈ పని చేసినట్లు అర్థమవుతోంది.
జుడోక చమిలా దిలాని, ఆమె మేనేజర్ అసెలా డిసిల్వా, రెజ్లర్ షానిత్ చతురంగ గతవారం అదృశ్యమయ్యారు. ఆ తర్వాత మరో ఏడుగురు కనిపించకుండా పోయారు. మొత్తం 160 మందితో శ్రీలంక కామన్వెల్త్ బరిలో నిలవగా.. ఈ వెంట్లు ముగిసిన తర్వాత 10 మంది మిస్సయ్యారు. బ్రిటన్లోనే ఉండేందుకు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఏఎఫ్పీ కథనం ప్రకారం ముగ్గురిని బ్రిటీష్ పోలీసులు అదుపులోకి తీసుకున్నా.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. ఎందుకంటే ఆ ముగ్గురికి 6 నెలల పాటు చెల్లుబాటు అయ్యే వీసాలు ఉన్నాయని సమాచారం. అయితే ఇలా శ్రీలంక అథ్లెట్లు తప్పిపోవడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ అంతర్జాతీయ ఈవెంట్లను శ్రీలంక అథ్లెట్లు అదృశ్యమయ్యారు. గతేడాది ఓస్లోలో జరిగిన వరల్డ్ చాంపియన్షిప్ సందర్భంగా శ్రీలంక రెజ్లింగ్ మేనేజర్ తప్పిపోయాడు. 2014లో సౌత్ కొరియాలో జరిగిన ఆసియా గేమ్స్లో ఇద్దరు ఇలానే అదృశ్యమయ్యారు.
ఆర్థిక సంక్షోభం కారణం శ్రీలంకలో ప్రజా జీవనం స్థంభించింది. పరిస్థితులు చాలా దారుణంగా మారాయి. పెట్రోల్, నిత్యవసర వస్తువులు దొరకక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆ దేశంలో ప్రజలు ఉండలేకపోతున్నారు.