కబడ్డీ తన జీవితాన్నే మార్చేసిందని తెలుగు టైటాన్స్ కెప్టెన్ విజయ్ మాలిక్ అన్నాడు. మారు మూల పల్లెటూరు నుంచి వచ్చిన తనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందంటే దానికి ప్రధాన కారణం కబడ్డీ అని తెలిపాడు. ప్రొకబడ్డీ లీగ్ సీజన్ 12 క్యాంపైన్లో భాగంగా సోమవారం వైజాగ్లోని గీతం యూనివర్సిటీలో తెలుగు టైటాన్స్ జట్టు సందడి చేసింది. టీమ్ ఆటగాళ్లంతా యూనివర్సిటీ విద్యార్థులతో చిట్ చాట్ చేసారు. తమ అనుభవాలను, కబడ్డీ ప్లేయర్లుగా ఎదిగేందుకు పడ్డ కష్టాలను విద్యార్థులతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా తెలుగు టైటాన్స్ కెప్టెన్ విజయ్ మాలిక్ తన ప్రసంగంతో విద్యార్థులను ఆకట్టుకున్నారు. తన జీవిత ప్రయాణం గురించి చెప్పి వారిలో స్ఫూర్తిని నింపారు. 'నేను చిన్న గ్రామం నుంచి వచ్చాను. కబడ్డీ నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ప్రస్తుతం భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కబడ్డీ ఆటగాళ్లను జనాలు గుర్తిస్తున్నారు. ఇది మా కల సాకారమైందనే భావనను కలిగిస్తోంది. మరీ ముఖ్యంగా కబడ్డీ మా కుటుంబాలను ఆర్థికంగా నిలబెట్టే శక్తిని ఇచ్చింది. ఇదే మా అసలైన విజయం. పట్టుదలతో ప్రయత్నిస్తే అత్యంత కఠినమైన పరిస్థితుల నుంచి కూడా ప్రపంచస్థాయికి చేరవచ్చని నా ప్రయాణంతో రుజువైంది.'అని విజయ్ మాలిక్ చెప్పుకొచ్చాడు.

కబడ్డీ కేవలం ఒక క్రీడ మాత్రమే కాదని, మన దేశ సంస్కృతని పీకేఎల్ టెక్నికల్ డైరెక్టర్ ఈ ప్రసాద్ రావు అన్నారు. పల్లెటూరి ఆట అయిన కబడ్డీ ప్రొ కబడ్డీ లీగ్ కారణంగా ప్రపంచ స్థాయి ఆటగా ఎదిగిందని చెప్పారు. 'కబడ్డీ కేవలం ఒక క్రీడ మాత్రమే కాదు. ఈ దేశ సంస్కృతి, గుర్తింపు. ఒకప్పుడు ఒక సాధారణ పల్లెటూరి ఆటగా ప్రారంభమైన కబడ్డీ.. ప్రొ కబడ్డీ లీగ్ కారణంగా ప్రపంచ స్థాయి క్రీడగా ఎదిగింది. బీచ్ల నుంచి ఇండోర్ స్టేడియంల వరకు, ఏషియన్ గేమ్స్ నుంచి ప్రపంచ వేదిక వరకు కబడ్డీ అభివృద్ధి చెందింది. ఒలింపిక్స్లో భారత కబడ్డీ జట్టు బంగారు పతకం గెలుచుకునే రోజు ఎంతో దూరంలో లేదు. కోటీశ్వరులు కావాలంటే ప్రొ కబడ్డీ లీగ్లో చేరాలి.'అని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలుగు టైటాన్స్ ఆటగాళ్లు, విద్యార్థులతో కలిసి ఆటపాటలు, క్విజ్ కాంపిటిషన్లో పాల్గొన్నారు. కబడ్డీ ఆటకు అభిమానలను మరింత దగ్గరగా చేసే ప్రయత్నం ఈ కార్యక్రమం ద్వారా జరిగింది. ఆగస్ట్ 29న ప్రారంభమైన ప్రొ కబడ్డీ సీజన్ 12 దిగ్విజయంగా సాగుతోంది. ఈ సీజన్ను ఓటమితో ప్రారంభించిన తెలుగు టైటాన్స్ వరుసగా రెండు విజయాలతో జోరు మీదుంది. వైజాగ్ వేదికగానే తొలి దశ మ్యాచ్లు జరుగుతున్నాయి. District by Zomatoలో పీకేఎల్ సీజన్ 12 మ్యాచ్ల టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మ్యాచ్ల ప్రత్యక్ష ప్రసారం స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్స్టార్లో వస్తుంది.