ప్రొ కబడ్డీ లీగ్ ఫ్రాంచైజీ తమిళ్ తలైవాస్పై ఆ జట్టు హెడ్ కోచ్ సంజీవ్ బాలియన్ సంచలన ఆరోపణలు చేశారు. పేరుకే ఈ జట్టుకు తాను కోచ్గా ఉన్నానని, పెత్తనమంతా మేనేజ్మెంట్దేనని తెలిపాడు. కనీసం ఆటగాళ్లను తుది జట్టులోకి ఎంపిక చేసే అధికారం తనకు లేదని చెప్పాడు. జట్టులో మేనేజ్మెంట్ జోక్యం ఎక్కువైందని ఆరోపించాడు.
ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12లో తమిళ్ తలైవాస్ లీగ్ దశలోనే నిష్క్రమించింది. 18 మ్యాచ్ల్లో 6 మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్లో 8వ స్థానంతో సరిపెట్టుకుంది. మంగళవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో తమిళ్ తలైవాస్ 43-44 తేడాతో బెంగాల్ వారియర్స్ చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న కోచ్ సంజీవ్ బాలియన్.. జట్టులో రాజకీయాలు ఎక్కువయ్యాయని తెలిపాడు. టీమ్ మేనేజ్మెంట్ అతి జోక్యం కారణంగానే జట్టుకు ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.

'ఫిట్గా లేని ఆటగాళ్లు ఆడుతున్నారు. కానీ ఫిట్గా ఉన్న ఆటగాళ్లు బెంచ్కే పరిమితమయ్యారు. వారిని జట్టులోకి తీసుకొచ్చే అధికారం కూడా మాకు లేదు. మాలాంటి కోచ్లు కేవలం పేరుకు మాత్రమే ఇక్కడ ఉన్నారు. జట్టు నిర్ణయాల్లో మాకు ఎలాంటి పాత్ర, అధికారం లేదు.'అని సంజీవ్ బాలియన్ అసహనం వ్యక్తం చేశారు.
సాధారణంగా ప్రెస్ కాన్ఫరెన్స్లకు సంజీవ్ బాలియన్ దూరంగా ఉంటారు. కానీ ఆఖరి మ్యాచ్ తర్వాత టీమ్మేనేజ్మెంట్పై ఆగ్రహం వెళ్లగక్కేందుకే మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. పవన్ సెహ్రావత్ను జట్టు నుంచి తప్పించడంలో తన పాత్ర లేదని స్పష్టం చేశాడు. కనీసం తనను సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపాడు. ప్రతిభావంతమైన పవన్ సెహ్రావత్ దూరమవ్వడం టీమ్ కాంబినేషన్ను దెబ్బతీసిందని చెప్పాడు. మేనేజ్మెంట్ అతి జోక్యం కారణంగానే తమిళ తలైవాస్ అంచనాలను అందుకోలేకపోయిందన్నాడు.
ఈ సీజన్ మధ్యలో జట్టు క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డాడని పవన్ సెహ్రావత్ను తమిళ్ తలైవాస్ జట్టు నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై పవర్ సెహ్రావత్ అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డానని నిరూపిస్తే.. జీవితంలో మళ్లీ కబడ్డీ ఆడనని సవాల్ విసిరారు. మేనేజ్మెంట్లోని ఓ వ్యక్తి కారణంగా తనపై వేటు పడిందని సెహ్రావత్ ఆరోపించాడు. వాస్తవానికి గతేడాది వరకు పవన్ సెహ్రావత్ తెలుగు టైటాన్స్కు ఆడాడు. ఈ సారి వేలంలో తమిళ్ తలైవాస్ అతన్ని రూ. 59.5 లక్షల భారీ ధరకు కొనుగోలు చేసింది. జట్టుకు కెప్టెన్గా ఎంపిక చేసింది. కానీ అనూహ్యంగా అతనిపై వేటు వేసింది.