ప్రొకబడ్డీ లీగ్(పీకేఎల్) 2025 సీజన్లో తెలుగు టైటాన్స్ దుమ్మురేపుతోంది. ఆదివారం జరిగిన మినీ క్వాలిఫయర్స్లో తెలుగు టైటాన్స్ 37-32 తేడాతో బెంగళూరు బుల్స్ను ఓడించింది. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన తెలుగు టైటాన్స్ రైడింగ్లో సత్తా చాటి ఫస్టాఫ్ ముగిసే సమయానికి 16-14 తేడాతో ఆధిక్యంలో నిలిచింది.
సెకండాఫ్లో బెంగళూరు బుల్స్ నుంచి ప్రతిఘటన ఎదురైనా.. రైడింగ్లో ఎలాంటి తప్పిదం చేయకుండా ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని కైవసం చేసుకుంది. తెలుగు టైటాన్స్లో కెప్టెన్ విజయ్ మాలిక్(10), ఆల్రౌండర్ భరత్(12) సూపర్-10 పాయింట్లతో సత్తా చాటారు. ఈ ఇద్దరి అద్భుత ప్రదర్శనకు తోడుగా డిఫెండర్లు రాణించడంతో తెలుగు టైటాన్స్కు విజయం దక్కింది.

ఈ గెలుపుతో తెలుగు టైటాన్స్ ఎలిమినేటర్-3కి అర్హత సాధించింది. మంగళవారం జరిగే ఈ మ్యాచ్లో ఎలిమినేటర్-2 విజేతతో తలపడుతుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే నేరుగా క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తోంది. ఆ మ్యాచ్లో గెలిస్తే ఫైనల్ చేరుతోంది. ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది.మినీ క్వాలిఫయర్లో ఓడిన బెంగళూరు బుల్స్ నేడు జరిగే ఎలిమినేటర్-2లో పట్నా పైరేట్స్తో తలపడుతుంది. ఈ సారి తెలుగు టైటాన్స్దే టైటిల్ అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఆదివారం జరిగిన ఎలిమినేటర్-1లో పట్నా పైరేట్స్ 48-32 తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ను ఓడించింది. పట్నా పైరేట్స్ ఎలిమినేటర్-2కు అర్హత సాధించగా.. జైపూర్ పింక్ పాంథర్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాయింట్స్ టేబుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పుణేరి పల్టన్, దబాంగ్ ఢిల్లీ నేడు జరిగే క్వాలిఫయర్-1లో తలపడనున్నాయి.