బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) తొమ్మిదో సీజన్లో మ్యాచ్లు ఉత్కంఠగా సాగుతున్నాయి. లీగ్ ప్రారంభమైన రెండో రోజే మ్యాచ్లు హోరాహోరీగా మారాయి. రసవత్తర పోరాటాలు మొదలయ్యాయి. శనివారం అభిమానులకు కబడ్డీ మజాను పంచుతూ.. పోటాపోటీగా సాగిన రెండు మ్యాచ్లు టై అయ్యాయి. పట్నా పైరేట్స్, పుణెరి పల్టాన్ మధ్య తొలి మ్యాచ్ 34-34తో డ్రాగా ముగియగా.. గుజరాత్ జెయింట్స్తో మ్యాచ్ను తమిళ్ తలైవాస్ 31-31తో టైగా ముగించింది. మరో మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 41-33తో బెంగాల్ వారియర్స్ను ఓడించింది.
పట్నా పైరేట్స్తో జరిగిన తొలి మ్యాచ్లో అస్లామ్ 7 పాయింట్లతో రైడింగ్లో సత్తాచాటడంతో తొలి అర్ధభాగంలో పుణెరి పల్టాన్ 23-16తో ఆధిక్యం సాధించింది. కానీ రెండో అర్ధభాగంలో పుంజుకున్న పట్నా పైరేట్స్ మ్యాచ్ను రసవత్తరంగా మార్చేసింది. ఓ దశలో ఆ జట్టు 26-24తో ఆధిపత్యం ప్రదర్శించింది. కానీ పుణెరి ఆటగాళ్లు పట్టు వదల్లేదు. అస్లామ్, ఆకాశ్ (6) రాణించి 30-30తో స్కోరు సమం చేశారు. అక్కడి నుంచి రెండు జట్లూ ఒక్కో పాయింట్ గెలుస్తూ వెళ్లడంతో చివరకు మ్యాచ్ టైగా ముగిసింది. పట్నా తరపున సచిన్ (8), రోహిత్ (6) రాణించారు. పుణెరి జట్టులో మోహిత్ (8) కూడా సత్తాచాటాడు.
తమిళ తలైవాస్తో జరిగిన మ్యాచ్లో రాకేశ్ సత్తా చాటడంతో తొలి అర్థభాగంలో గుజరాత్ జెయింట్స్ 18-16తో ఆధిక్యం సాధించింది. కానీ సెకండాఫ్లో పుంజుకున్న తమిళ తలైవాస్ మ్యాచ్ను రసవత్తరంగా మార్చేసింది. ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడటంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. గుజరాత్ తరపున రైడింగ్లో రాకేశ్ (13) అదరగొట్టాడు. తలైవాస్ జట్టులో నరేందర్ (10), హిమాన్షు (5) మెరిశారు. మరో మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 41-33తో బెంగాల్ వారియర్స్ను ఓడించింది. రైడింగ్లో మంజీత్ (18) చెలరేగి జట్టుకు విజయాన్ని అందించాడు. ఆదివారం జరిగే మ్యాచ్లో బెంగాల్ వారియర్స్తో తెలుగు టైటాన్స్ ఢీకొననుంది.