ప్రొకబడ్డీ లీగ్ సీజన్ 10లో తెలుగు టైటాన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఈ సీజన్లో తెలుగు టైటాన్స్ 11వ ఓటమిని నమోదు చేసింది. శుక్రవారం సొంతగడ్డపై జరిగిన మ్యాచ్లోనూ తెలుగు టైటాన్స్కు నిరాశే ఎదురైంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్కు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేయగా.. తెలుగు టైటాన్స్ 26-46తో బెంగళూరు బుల్స్ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది.
టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ వచ్చి మద్దతు తెలిపినా తెలుగు టైటాన్స్ రాత మారలేదు. తెలుగు టైటాన్స్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న బాలయ్య.. సొంతగడ్డపై జరిగిన తొలి మ్యాచ్కు హాజరై మద్దతు తెలిపారు. తెలుగు టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ షెరావత్ 7 పాయింట్లతో ఒక్కడే ఒంటరి పోరాటం చేయగా ఇతర ప్లేయర్ల నుంచి అతనికి సరైన సహకారం లభించలేదు.

మరోవైపు బెంగళూరు బుల్స్లో అక్షిత్ (9), సుర్జిత్ సింగ్(7), వికాశ్ కందోల(6) సత్తా చాటారు. సొంత అభిమానుల మద్దతుతో ఉత్సాహంగా బరిలోకి దిగిన తెలుగు టైటాన్స్.. ఫస్టాఫ్లో దుమ్మురేపింది. అదిరిపోయే డిఫెన్స్తో వరుసగా పాయింట్లు సాధించింది. దాంతో ఫస్టాప్ ముగిసే సరికి తెలుగు టైటాన్స్ 12-9తో ఆధిక్యంలో నిలిచింది.
కానీ సెకాండాఫ్లో ఆ జోరును కొనసాగించలేకపోయింది. దూకుడైన ట్యాక్లింగ్, అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. ఏకంగా మూడు సార్లు ఆలౌటైంది. రైడింగ్, ట్యాక్లింగ్లో తెలుగు టైటాన్స్ విఫలమవ్వగా.. బెంగళూరు బుల్స్ దుమ్మురేపింది. సెకండాఫ్లో ఆ జట్టు 15 రైడింగ్, 11 ట్యాక్లింగ్, 6 ఆలౌట్ పాయింట్స్తో పాటు ఒక్క ఎక్స్ట్రా పాయింట్తో 33 పాయింట్స్ సాధించింది. ఓవరాల్గా 42-26తో హైదరాబాద్ను చిత్తు చేసింది.
తెలుగు టైటాన్స్ రైడింగ్లో 49 ప్రయత్నాల్లో 9 సార్లు మాత్రమే సక్సెస్ అయ్యింది. బెంగళూరు బుల్స్ మాత్రం 48 ప్రయత్నాల్లో 13 సార్లు పాయింట్స్ సాధించింది. ట్యాక్లింగ్లో తెలుగు టైటాన్స్ 24 ప్రయత్నాల్లో 7 సార్లు సక్సెస్ అవ్వడంతో పాటు 2 సార్లు సూపర్ ట్యాక్లింగ్ చేసింది. బెంగళూరు 23 ప్రయత్నాల్లో 16 సార్లు సక్సెస్ అయ్యింది. 12 మ్యాచ్ల్లో 11 పరాజయాలతో పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచిన తెలుగు టైటాన్స్.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది.