Pro kabaddi League ప్రోకబడ్డీ లీగ్ సీజన్ 10లో తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. 6 పరాజయాల తర్వాత తొలి విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 37-36 తేడాతో హరియాణా స్టీలర్స్పై గెలుపొందింది. ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి.
కానీ టైటాన్స్ను ఆలౌట్ చేసిన హర్యానా 16-11 పాయింట్లతో ఆధిక్యంలో దూసుకుపోయింది. ఈ పరిస్థితుల్లో పవన్ సెహ్రావత్ సూపర్ రైడ్లతో వరుస పాయింట్లు సాధించి స్కోర్ను 17-17తో సమం చేశాడు. అక్కడి నుంచి ఒక పాయింట్ నువ్వు.. ఒక పాయింట్ నేను అన్నట్లుగా పంచుకుంటూ ముందుకు సాగాయి. ఫస్టాఫ్ ముగిసే సరికి తెలుగు టైటాన్స్ 21-20తో ఒక్క పాయింట్ లీడ్ సాధించింది.

రెండో అర్థ భాగంలో ఇరు జట్లు హోరా హోరీగానే తలపడ్డాయి. నువ్వా-నేనా అన్నట్లు ఇరు జట్లు ఒక్కో పాయింట్తో ముందుకు సాగాయి. చివరకు 36-36తో మ్యాచ్ టై అయ్యేలా కనిపించింది. కానీ చివర్లో తెలుగు టైటాన్స్ ఓ పాయింట్ సాధించి ఈ సీజన్లో తొలి విజయాన్ని నమోదు చేసింది.
తెలుగు టైటాన్స్ విజయంలో పవర్ సెహ్రావత్ కీలక పాత్ర పోషించాడు. 10 రైడింగ్ పాయింట్స్తో సత్తా చాటాడు. 21 సార్లు రైడింగ్ వెళ్లిన అతను 7 టచ్ పాయింట్స్తో పాటు 3 బోనస్ పాయింట్స్ రాబట్టాడు. 5 సార్లు విఫలమైన పవన్.. 9 సార్లు పాయింట్స్ లేకుండానే వెనుదిరిగాడు. డిఫెండర్ అజిత్ పవార్ 7 పాయింట్స్ సాధించగా.. సందీప్ ధుల్ 5 పాయింట్స్ రాబట్టాడు.
హర్యానా స్టీలర్స్లో శివమ్ పటారే 12 పాయింట్స్తో అదరగొట్టినా ఫలితం లేకపోయింది. మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 46-33తో తమిళ్ తలైవాస్ను ఓడించింది. సుధాకర్(11), మంజీత్(8) పట్నాను గెలిపించారు. తలైవాస్లో హిమాంశు(8), అజింక్య పవార్(6) రాణించారు.