
బెంగళూరు: ప్రొకబడ్డీ లీగ్ సీజన్-8లో తెలుగు టైటాన్స్ను మరో పరాజయమే వెక్కిరించింది. సోమవారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 30-31తో పట్నా పైరైట్స్ చేతిలో ఓటమిపాలైంది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్లో ఆటగాళ్ల అత్యుత్సాహం తెలుగు టైటాన్స్ కొంపముంచింది. గేమ్ చివరి రైడ్లో తెలుగు టైటాన్స్ డిఫెండర్ సందీప్ కండోలా చేసిన తప్పిదం జట్టు పతనాన్ని శాసించింది. పట్నా పైరేట్స్లో మోను గోయట్ ఏడు, సంచిన్ ఆరు, ప్రశాంత్ కుమార్ 5 పాయింట్లు సాధించారు. తెలుగు టైటాన్స్లో యువ రైడర్ అంకిత్ బెనివాల్ సూపర్ 10 సాధించినా ఫలితం లేకపోయింది. కెప్టెన్ రోహిత్ కుమార్ వైఫల్యం జట్టు ఓటమికి కారణమైంది.
రోహిత్ కుమార్ తప్పిదాలతో ఆరంభంలోనే తెలుగు టైటాన్స్ వెనుకబడింది. చెలరేగిన పట్నా ఆటగాళ్లు.. తెలుగు టైటాన్స్ను ఆలౌట్ చేసి లీడ్ సాధించారు. అయితే ఆ తర్వాత అంకిత్ బెనివాల్ సూపర్ రైడ్తో మూడు పాయింట్లు తేవడంతో తెలుగు టైటాన్స్ కమ్ బ్యాక్ చేసింది. వరుస పాయింట్లు సాధించింది. అయితే ఫస్టాఫ్ ముగిసే సరికి 13-18తో పట్నా లీడ్ సాధించింది. ఇందులో తెలుగు టైటాన్స్ 8 రైడింగ్ పాయింట్స్, 4 ట్యాకిల్ పాయింట్స్ సాధించగా.. పట్నా 10 రైడింగ్, 6 ట్యాకిల్తో పాటు 2 ఆలౌట్ పాయింట్స్తో జోరు కనబర్చింది. ఇక సెకండాఫ్లో చెలరేగిన తెలుగు టైటాన్స్.. 10 రైడింగ్, 4 ట్యాకిల్, 2 ఆలౌట్ పాయింట్స్తో 17 పాయింట్స్ సాధించి స్కోర్లు సమం చేసింది. చివరి రైడ్కు ముందు 30-30తో స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ టై అవుతుందని అంతా భావించారు. కానీ రైడ్కు వచ్చిన సచిన్ను అత్యుత్సాహంతో సందీప్ పట్టే ప్రయత్నం చేసి ఔటయ్యాడు. దాంతో తెలుగు టైటాన్స్ ఓటమిపాలైంది.
మరో మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 31-28తో జైపూర్ పింక్ పాంథర్స్ను ఓడించింది. బెంగాల్ టీమ్లో కెప్టెన్ మణీందర్ సింగ్ 13, మహమ్మద్ నబీబక్ష్ 10 రైడింగ్ పాయింట్స్తో సత్తా చాటి విజయంలో కీలక పాత్ర పోషించారు. జైపూర్లో అర్జున్ దేశ్వాల్ 16 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. ఫస్టాఫ్లో 18-14తో లీడ్ సాధించిన బెంగాల్ వారియర్స్.. సెకండాఫ్లో అదే లీడ్ను కాపాడుకొని విజయాన్నందుకుంది.