ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో తమిళ తలైవాస్ మూడో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన తొలి మ్యాచ్లో తమిళ తలైవాస్ 46-27 తేడాతో యూపీ యోధాను ఓడించింది. తమిళ తలైవాస్ తరఫున రైడర్ నరేందర్ 14 పాయింట్లతో సత్తా చాటగా.. డిఫెండర్స్ సాగర్, మోహిత్, సోహిల్ గులియా 5 పాయింట్లతో రాణించారు. యూపీ యోధాస్లో విజయ్ మాలిక్ ఒక్కడే 10 పాయింట్లతో సత్తా చాటాడు.
మ్యాచ్ ఆరంభం నుంచే తమిళ తలైవాస్ దూకుడు కనబర్చింది. ఫస్టాఫ్లో రైడింగ్లో సత్తా చాటిన తమిళ తలైవాస్ యూపీ యోధాస్ను ఒకసారి ఆలౌట్ చేసి 19-11 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. సెకండాఫ్లోనూ అదే జోరు కనబర్చిన తమిళ తలైవాస్.. డిఫెండర్స్ సూపర్ ట్యాక్లింగ్స్తో పాయింట్ల మోత మోగించింది. రెండు సార్లు ఆలౌట్ చేసి భారీ ఆధిక్యంతో విజయాన్ని అందుకుంది.

మొత్తం 48 సార్లు రైడింగ్కు వెళ్లిన తమిళ తలైవాస్ 16 సార్లు సక్సెస్ అయ్యింది. ట్యాక్లింగ్లో 31 ప్రయత్నాల్లో 18 సార్లు ప్రత్యర్థి ఆటగాళ్లను పట్టేసింది. యూపీ యోధాస్ 27 ప్రయత్నాల్లో 8 సార్లు మాత్రమే ట్యాక్లింగ్ చేసింది. 47 రైడ్స్లో 15 సార్లు మాత్రమే సక్సెస్ అయ్యింది.
పాయింట్స్ టేబుల్లో తమిళ తలైవాస్ 11వ స్థానంలో కొనసాగుతుండగా.. యూపీ యోధాస్ 10వ స్థానంలో ఉంది. ఇరు జట్లు మూడేసి మ్యాచ్లు మాత్రమే గెలిచాయి. దాదాపు ప్లే ఆఫ్స్ అవకాశాలను ఈ రెండు జట్లు చేజార్చుకున్నాయి. 10 మ్యాచ్ల్లో 9 విజయాలతో పుణేరి పల్టాన్ అగ్రస్థానంలో ఉండగా.. 11 మ్యాచ్ల్లో ఏడు విజయాలతో దబాంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్ 2, 3 స్థానాల్లో ఉన్నాయి.