Pro Kabaddi League: గుజరాత్ జెయింట్స్ జోరు.. తమిళ్ తైలవాస్ బోణీ!
PKL Season 10: ప్రొకబడ్డీ లీగ్ పదో సీజన్లో గుజరాత్ జెయింట్స్ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తెలుగు టైటాన్స్ను ఓడించి శుభారంభం చేసిన గుజరాత్ జెయింట్స్.. సొంతగడ్డపై వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మరోమ్యాచ్లో దబాంగ్ ఢిల్లీని ఓడించిన తమిళ తలైవాస్ శుభారంభం చేసింది.
ఆదివారం హోరాహోరీగా సాగిన రెండో మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ 34-31 తేడాతో బెంగళూరు బుల్స్ను ఓడించింది. ఈ మ్యాచ్లో ఎక్కువ సమయం వెనుకబడి ఉన్న గుజరాత్ జెయింట్స్.. కీలక సమయంలో పుంజుకొని సంచలన విజయాన్నందుకుంది.

మ్యాచ్ ప్రారంభంలో రైడింగ్లో తడబడిన గుజరాత్ జెయింట్స్ ఫస్టాఫ్ ముగిసేసరికి 14-20తో వెనుకబడింది. ఓసారి ఆలౌట్ కూడా అయ్యింది. సెకండాఫ్లో అద్భుతంగా పుంజుకున్న ఆ జట్టు గొప్పగా ఆడింది. 12 పాయింట్స్తో సోను ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చగా.. గుజరాత్ జెయింట్స్ దూసుకెళ్లింది. అతను చేసిన సూపర్ ట్యాకిల్ మ్యాచ్ను మలుపు తిప్పింది.
చివర్లో తీవ్ర ఒత్తిడిలో బలంగా నిలబడి గెలుపును సొంతం చేసుకుంది. గుజరాత్ జెయింట్స్లో రాకేశ్, సోంబీర్ చెరో 5 పాయింట్లతో రాణించారు. బెంగళూరు బుల్స్ తరఫున భరత్ 7 పాయింట్స్ సాధించగా.. వికాస్ 6 పాయింట్లతో ఆకట్టుకున్నాడు.

తొలి మ్యాచ్లో తమిళ తలైవాస్ 42-31 తేడాతో దబాంగ్ ఢిల్లీని చిత్తు చేసింది. తమిళ తలైవాస్ తరఫున అజింక్య పవార్ 21 పాయింట్లతో చెలరేగాడు. నరేందర్ 8 రైడింగ్ పాయింట్స్తో సత్తా చాటాడు. ఢిల్లీ దబాంగ్ జట్టులో కెప్టెన్ నవీన్ కుమార్ 14 పాయింట్లతో రాణించగా.. అషు 9 పాయింట్లతో పోరాడాడు. కానీ ఈ ఇద్దరికీ ఇతర ఆటగాళ్ల నుంచి సహకారం అందకపోవడంతో ఓటమిపాలయ్యారు.
ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా నేడు పుణెరి పల్టాన్, జైపూర్ పింక్ పాంథర్స్ తలపడనున్నాయి. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 9 గంటలకు ప్రారంభమయ్యే మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్ , బెంగాల్ వారియర్స్ తలపడనున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications