ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 10 ఛాంపియన్గా పుణేరి పల్టాన్ అవతరించింది. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన ఫైనల్లో పుణేరి పల్టాన్ 28-25 తేడాతో హర్యానా స్టీలర్స్ను ఓడించింది. ఆసాంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ కబడ్డీ అభిమానులకు కావాల్సిన మజాను అందించింది. ఆఖరి క్షణం వరకు విజయం ఇరు జట్లను ఊరించింది. ఒత్తిడిని తట్టుకుంటూ ముందుకు సాగిన పుణేరి పల్టాన్ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని అందుకుంది. ప్రొకబడ్డీ టైటిల్ గెలవడం పుణేరి పల్టాన్కు ఇదే తొలిసారి.
పుణేరి పల్టాన్లో పంకజ్ మోహితే(9) పాయింట్లతో సత్తా చాటగా.. కెప్టెన్ అస్లామ్ ముస్తాఫా(4), మోహిత్ గోయత్(5) కీలక పాయింట్స్ రాబట్టారు. హర్యానా స్టీలర్స్లో శివమ్ పటారే 6 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలవగా.. సిద్దార్థ్ దేశాయ్ 4 పాయింట్లు రాబట్టాడు.

మ్యాచ్ ఆరంభం నుంచే ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. రైడింగ్ కాస్త మెరుగైన ప్రదర్శన చేసిన హర్యానా 13-10 లీడ్తో ఫస్టాఫ్ను ముగించింది.
సెకండాఫ్లో కూడా ఇరు జట్లు నువ్వా-నేనా తలపడ్డాయి. ఒక్కో పాయింట్తో సమంగా దూసుకెళ్లాయి. హర్యానా స్టీలర్స్ రైడింగ్లో సత్తా చాటగా.. ట్యాక్లింగ్లో తేలిపోయింది. అంతేకాకుండా ఒకసారి ఆలౌటై అనవసరంగా రెండు పాయింట్స్ చేజార్చుకుంది. దాంతో 3 పాయింట్ల తేడాతో టైటిల్ను చేజార్చుకుంది.
ఈ మ్యాచ్లో ఇరు జట్లు 43 సార్లు రైడింగ్కు వెళ్లగా.. పుణేరి పల్టాన్ 12, హర్యానా స్టీలర్స్ 15 సార్లు సక్సెస్ అయ్యింది. ట్యాక్లింగ్లో పుణేరి పల్టాన్ 20 ప్రయత్నాల్లో 9 సార్లు సక్సెస్ అవ్వగా.. హర్యానా 21 ప్రయత్నాల్లో 5 సార్లు మాత్రమే రైడర్లను పట్టుకుంది.