ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 10లో పట్నా పైరేట్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. సొంతగడ్డపై శుక్రవారం జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ 44-28 తేడాతో బెంగాల్ వారియర్స్ను చిత్తు చేసింది. పట్నాలో మంజీత్(10), సచిన్(9) సత్తా చాటగా.. బెంగాల్ జట్టులో నితిన్(10) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు.
ఆరంభం నుంచే పట్నా పైరేట్స్ దూకుడు కనబర్చింది. ఫస్టాఫ్లో బెంగాల్ను ఆలౌట్ చేసిన పట్నా 19-10తో ఆధిక్యం సాధించింది. సెకండాఫ్లో బెంగాల్ వారియర్స్ పుంజుకున్నా.. పట్నా పైరేట్స్ అవకాశం ఇవ్వలేదు. సూపర్ ట్యాక్లింగ్తో బెంగాల్ను రెండు సార్లు ఆలౌట్ చేసిన పట్నా.. ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని సొంతం చేసుకుంది.

ఆ జట్టుకు ఇది ఏడో విజయం. 15 మ్యాచ్ల్లో ఏడు గెలిచిన పట్నా.. మరో ఏడింటిలో ఓడింది. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. ప్రస్తుతం ఆ జట్టు ఆరో స్థానంలో కొనసాగుతోంది.
మరో మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ 44-35 తేడాతో యూ ముంబాను ఓడించింది. గుజరాత్ జెయింట్స్ రైడర్ ప్రతీక్ దహియా 12 పాయింట్లతో దుమ్మురేపగా.. సోను 6 పాయింట్లతో సత్తా చాటాడు. యు ముంబాలో గుమన్ సింగ్(11), ముకిలన్ షన్ముగమ్(5), అమిర్ మహమ్మద్(5) రాణించినా ఫలితం లేకపోయింది.
ఆరంభం నుంచి ఇరు జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. రైడింగ్లో సత్తా చాటిన గుజరాత్ 20-17తో ఫస్టాఫ్ను ముగించింది. సెకండాఫ్లోనూ అదే జోరును కొనసాగించిన గుజరాత్.. యుముంబాను నిలవరించింది. గుజరాత్ జెయింట్స్కు ఇది 9వ విజయం కాగా.. యు ముంబాకు ఏడో పరాజయం. 15 మ్యాచ్ల్లో గుజరాత్ 9 విజయాలు, 6 పరాజయాలతో 4వ స్థానంలో కొనసాగుతోంది. యు ముంబా 15 మ్యాచ్ల్లో 6 విజయాలు.. 7 పరాజయాలతో ఏడో స్థానంలో నిలిచింది.