ప్రొ కబడ్డీ సీజన్ 10లో తెలుగు టైటాన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. టోర్నీ ముగింపు దశకు చేరినా ఆ జట్టు విజయాన్ని అందుకోలేకపోతుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 44-51 తేడాతో జైపూర్ పింక్ పాథర్స్ చేతిలో చిత్తయ్యింది. ఈ సీజన్లో తెలుగు టైటాన్స్కు ఇది 19వ పరాజయం.
ఇప్పటి వరకు 21 మ్యాచ్లు ఆడిన తెలుగు టైటాన్స్ 2 విజయాలు మాత్రమే నమోదు చేసింది. అత్యంత పేలవ ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్లో చిట్ట చివరి స్థానంలో నిలిచింది. తెలుగు టైటాన్స్ తమ చివరి మ్యాచ్ను మంగళవారం(ఫిబ్రవరి 20) యూ ముంబాతో ఆడనుంది.

జైపూర్ పింక్ పాంథర్స్తో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ పవన్ షెరావత్ 22 పాయింట్లతో రాణించినా.. ఇతర ఆటగాళ్ల నుంచి సహకారం లభించలేదు. మరోవైపు జైపూర్ తరఫున అర్జున్ దేశ్వాల్(16), సునీల్ కుమార్(8), అభిజీత్ మాలిక్(8) సత్తా చాటారు. ఫస్టాఫ్ ముగిసే సరికి 28-20తో ఆధిక్యంలో నిలిచిన తెలుగు టైటాన్స్.. సెకండాఫ్లో దారుణంగా విఫలమైంది. రెండు సార్లు ఆలౌటై.. గెలవాల్సిన మ్యాచ్లో ఓటమికి తల వంచింది.
ప్లే ఆఫ్స్ చేరిన హరియాణా స్టీలర్స్
మరో మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 39-32 తేడాతో పట్నా పైరేట్స్ను ఓడించింది. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకుంది. ఇరు జట్లు హోరాహోరీగా తలపడటంతో ఫస్టాఫ్ ముగిసే సమయానికి 13-13తో సమంగా నిలిచాయి.
సెకండాఫ్లో పట్నా నుంచి గట్టి పోటీ ఎదురైనా.. సత్తా చాటిన స్టీలర్స్ విజయాన్ని అందుకుంది. సిద్దార్థ్ దేశాయ్(12) స్టీలర్స్ను గెలిపించాడు. అతనితో పాటు లెఫ్ట్ కవర్ డిఫెండర్ జైదీప్ దహీయా(6), రైట్ కవర్ డిఫెండర్ రాహుల్(8) సత్తా చాటారు. పట్నాలో రోహిత్(8), యువరాజ్(6), సంజయ్(5) రాణించారు.