బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ 8వ సీజన్లో తెలుగు టైటాన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. మంగళవారం హర్యానా స్టీలర్స్తో జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 39-39తో టై చేసుకొని గట్టెక్కింది. చివరి రైడ్కు వచ్చిన హర్యానా కెప్టెన్ వికాస్ కండోలాను ట్యాకిల్ చేసిన తెలుగు టైటాన్స్ మరో ఓటమిని తప్పించుకుంది. తెలుగు టైటాన్స్లో అంకిత్ బెనివాల్(10) సూపర్ 10 సాధించగా.. కెప్టెన్ రోహిత్ కుమార్ (8 పాయింట్లు), డిఫెండర్ ఆదర్శ్(6), సందీప్ కండాల(6) ఫర్వాలేదనిపించారు. హర్యానాలో కెప్టెన్ వికాస్ కండోలా(10) సూపర్ టెన్ సాధించగా.. ఆల్రౌండర్ రోహిత్ గులియా(8), రైడర్ వినయ్(8) రాణించారు.
ఆరంభం నుంచి ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు పోటీపడ్డాయి. దాంతో గేమ్ ఆఖరి సెకన్ వరకు రసవత్తరంగా సాగింది. ఫస్టాఫ్లో హర్యానా 12 రైడ్, 5 ట్యాకిల్, 2 ఆలౌట్, ఎక్స్ట్రా పాయింట్స్తో 20-19తో ఒక్క పాయింట్ లీడ్ సాధించింది. తెలుగు టైటాన్స్ 9 రైడింగ్ పాయింట్స్ సాధించినా ట్యాకిలింగ్లో సత్తా చాటింది. 8 పాయింట్లతో 2 ఆలౌట్ పాయింట్స్ తెచ్చింది. అయితే ఎక్స్ట్రా పాయింట్ రాకపోవడంతో ఆధిక్యం సాధించలేకపోయింది.
సెకండాఫ్లో కూడా ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. తెలుగు టైటాన్స్ రైడింగ్లో సత్తాచాటి ఒక్క పాయింట్ లీడ్ సాధించి మ్యాచ్ను టై చేసుకుంది. 39-38తో లీడ్లో హర్యానా ఆఖరి రైడ్లో తప్పిదం చేసి మూల్యం చెల్లించుకుంది. ఆ జట్టు కెప్టెన్ వికాస్ కండోలాను ట్యాకిల్ చేసి తెలుగు టైటాన్స్ మ్యాచ్ను కాపాడుకుంది. ఇక రెండు జట్లలోని ఆటగాళ్లకు కరోనా సోకడంతో ఆరు రోజుల మ్యాచ్లను రీషెడ్యూల్ చేసినట్టు ఆర్గనైజర్స్ ప్రకటించారు. ఎఫెక్ట్ అయిన టీమ్స్ ప్లేయర్ల వివరాలను మాత్రం వెల్లడించలేదు.