బెంగళూరు: ప్రొకబడ్డీ లీగ్ సీజన్-8లో జైపూర్ పింక్ పాంథర్స్, హర్యానా స్టీలర్స్ మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నాయి. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ 41-37 తేడాతో బెంగాల్ వారియర్స్కు షాకివ్వగా.. రెండో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 31-26తో పుణేరి పల్టాన్ను ఓడించింది. రసవత్తంగా సాగిన ఈ రెండు మ్యాచ్లు అభిమానులకు కావాల్సిన మజాను అందించాయి. బెంగాల్, హర్యానా మధ్య జరిగిన తొలి మ్యాచ్ అనేక మలుపులు తిరుగుతూ ఉత్కంఠరేపింది.
హర్యానా స్టీలర్స్ రైడర్స్ వికాశ్ కండోలా 9, ఆల్రౌండర్ మీటూ 10 పాయింట్లతో సత్తా చాటారు. బెంగాల్ వారియర్స్లో మనీందర్ సింగ్ 14 , ఆల్రౌండర్ మహమ్మద్ నబీబక్ష్ 9 పాయింట్స్తో పోరాడినా ఫలితం లేకపోయింది. ఫస్టాఫ్లో బెంగాల్ వారియర్స్ దుమ్మురేపింది. హర్యానాను ఒక సారి ఆలౌట్ చేసి ఫస్టాఫ్ ముగిసేసరికి 18-15తో లీడ్ సాధించింది. కానీ సెకండాఫ్లో అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. రెండు సార్లు ఆలౌటైన ఆ జట్టు.. చివరి క్షణంలో చేసిన తప్పిదాలతో ఓటమిపాలైంది. ముఖ్యంగా కెప్టెన్ మనీందర్ సింగ్ కీలక సమయంలో ఔటవ్వడం ఆ జట్టు కొంపముంచగా.. స్మార్ట్గా ఆడిన హర్యానా లీడ్ను కాపాడుకొని విజయాన్నందుకుంది.
జైపూర్, పుణేరి మ్యాచ్ సైతం ఆఖరి క్షణం వరకు ఆసక్తిగా సాగింది. జైపూర్లో అర్జున్ దేశ్వాల్ 11 పాయింట్లతో సత్తా చాటగా.. పుణేరి పల్టాన్లో అస్లామ్ ఇమాదర్ 6 పాయింట్లతో రాణించాడు. లో స్కోరింగ్ గేమ్ అయినా.. ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఫస్టాఫ్ ముగిసే సరికి జైపూర్ 18-17తో ఒక్క పాయింట్ మాత్రమే లీడ్ సాధించింది. ఇక సెకండాఫ్లో కూడా ఇరు జట్ల మధ్య రసవత్తరపోరు కొనసాగింది. అయితే మెరుగైన ప్రదర్శన చేసిన జైపూర్ పింక్ పాంథర్స్.. పుణేరిని ఆలౌట్ చేసి పై చేయి సాధించింది.