Pro Kabaddi League సీజన్ 10లో గుజరాత్ జెయింట్స్ జోరు కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 39-37 తేడాతో యు ముంబాను చిత్తు చేసింది. గుజరాత్ జెయింట్స్ తరఫున రైడర్స్ సోనూ 11, రాకేష్ 9 పాయింట్లు సాధించగా..ఆల్రౌండర్ రోహిత్ గులియా 7, అక్రమ్ షేక్ 7, డిఫెండర్ ఫజెల్ అట్రాచలి 5 పాయింట్స్ సాధించారు.
యు ముంబా జట్టులో రైడర్స్ గుమన్ సింగ్ 10, ప్రణయ్ రాణే 5 పాయింట్స్ సాధించగా.. ఢిఫెండర్స్ మహేందర్ సింగ్ 5, ఆల్రౌండర్ అమిర్ మొహమ్మద్ 10 పాయింట్స్ సాధించారు. ఇరు జట్లు ఆరంభం నుంచి నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. ఫస్టాఫ్ సమయం ముగిసేసరికి యుముంబా 18-16తో ఆధిక్యంలో నిలిచింది.

సెకండాఫ్లో పుంజుకున్న గుజరాత్ జెయింట్స్.. యు ముంబాను ఆలౌట్ చేసి పై చేయి సాధించింది. గుజరాత్ రైడర్ సోనూ చెలరేగడంతో యు ముంబా ఇబ్బంది పడింది. ఆ జట్టు డిఫెండర్ల తప్పిదాలు కూడా గుజరాత్ జెయింట్స్కు కలిసొచ్చాయి. యు ముంబా కూడా పుంజుకొని గుజరాత్ను ఆలౌట్ చేసింది. కానీ 2 పాయింట్స్ ఆధిక్యంతో విజయ లాంఛనాన్ని పూర్తి చేసుకుంది. సొంతగడ్డపై హ్యాట్రిక్ విజయాలు సాధించిన గుజరాత్ జెయింట్స్ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
రేపు జరిగే మ్యాచ్ల్లో తెలుగు టైటాన్స్, పాట్నా రైడర్స్ తలపడనున్నాయి. రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. రాత్రి 9 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో యూపీ యోధాస్, హర్యానా స్టీలర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.